అక్కడే ఆగిపోకండి.. ‘విమోచన దినోత్సవం’పై కేటీఆర్‌ రిప్లై

27 Mar, 2023 12:25 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17 తేదీ ప్రత్యేకతపై రాజకీయపరమైన చర్చ, పార్టీల పరస్పర విమర్శలపర్వంగా ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటోంది. అయితే.. తాజాగా కర్ణాటక-తెలంగాణ సరిహద్దు గ్రామంలో  బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమోచన దినోత్సవ సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు.. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణపై ప్రకటనలు కూడా చేశారు. ఈ దరిమిలా.. 

ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమోచన దినోత్సవంపై ఓ ట్వీట్‌ చేశారు. ‘‘విమోచన దినోత్సవం అని ఎందుకు పిలవకూడదని అడిగే వాళ్లు.. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఆగష్టు 15వ  తేదీని ఎందుకు మనం లిబరేషన్‌ డేగా జరుపుకోకూడదు? అని ప్రశ్నించారు. 

అది బ్రిటీష్‌ వాళ్లు అయినా నిజాం అయినా..  అణచివేతదారులకు వ్యతిరేకంగా త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యం. ఇంకా అక్కడే ఉండిపోకండి.. మీ భవిష్యత్‌ నిర్మాణానికి ముందుకు రండి అంటూ ట్వీట్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారాయన. 

ఇక ఆదివారం కర్నాటకలోని బసవ కళ్యాణ్ తాలుకా గోరట గ్రామంలో రజాకార్ల దాష్టీకంపై పోరాడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆదివారం అమిత్ షా ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ భయపడుతున్నదని ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే  నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: తెలంగాణకు ఆమె గర్వకారణం: కేసీఆర్‌

మరిన్ని వార్తలు