వార్షిక నివేదిక: కరోనాపై పోరులో ‘కీ’ రోల్‌

11 Jun, 2021 00:50 IST|Sakshi

ప్రధాన పాత్ర పోషించిన ఫార్మా టెస్టుల కిట్ల నుంచి ప్రాణాధార ఔషధాల వరకు ఇక్కడే ఉత్పత్తి

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి టీకా తయారైనదీ హైదరాబాద్‌లోనే..

రూ. 6,734 కోట్ల పెట్టుబడులతో వచ్చిన 311 ఫార్మా కంపెనీలు

రాష్ట్ర పరిశ్రమల శాఖ వార్షిక నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి యావత్‌ దేశ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న దశలోనూ తెలంగాణలోని ఔషధ తయారీ రంగం అభివృద్ధిలో దూసుకుపోతోంది. గత ఏడాది వ్యవధిలో ఎన్నో ఆవిష్కరణలతో నూతన శిఖరాలను అందుకొనే దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టే ఔషధాల తయారీలో తెలంగాణలోని ఔషధరంగ పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రెమిడెసివిర్, ఫావిపిరవిర్‌ వంటి ప్రాణాధార మందులను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆమోదించిన ఆర్టీ–పీసీఆర్‌ కిట్లలో ఒకటి హైదరాబాద్‌లోనే తయారవగా ఇక్కడి పలు కంపెనీలు ఆర్టీ–పీసీఆర్‌ కిట్లు, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియమ్స్, రీ–ఏజెంట్స్‌ వంటి వాటిని ఉత్పత్తి చేశాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ విస్తృత కృషి వల్ల పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంగల తొలి కరోనా టీకా తయారైంది. అలాగే బయోలాజికల్‌–ఈ వంటి ఇతర కంపెనీలు సైతం కరోనా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. కేటీఆర్‌ గురువారం ఆవిష్కరించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ వార్షిక పురోగతి నివేదిక 2020–21లో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు.. 

హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ.. ప్రపంచ వ్యాక్సిన్‌ తయారీ రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ప్రతి ఐదు ప్రముఖ వ్యాక్సి¯Œ  తయారీ సంస్థల్లో నాలుగు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 
ఔషధ తయారీ రంగంలో 311 కంపెనీలు రూ. 6,734.56 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా వాటి ద్వారా 33,655 మందికి ఉపాధి లభించనుంది. మెడ్‌ట్రానిక్‌ సంస్థ తమ పరిశోధన–అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రం విస్తరణకు రూ. 1,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచి్చంది. 
నగరంలోని మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌లో తమ యూనిట్లు నెలకొల్పేందుకు 19 పరిశ్రమలు రూ. 204 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 2,400 మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి. 
ప్రముఖ జంతువుల పోషకాహార తయారీ కంపెనీ న్యూట్రికో నేతృత్వంలోని ‘ట్రౌవ్‌ న్యూట్రిషన్‌ ’జడ్చర్లలో తమ ఉత్పత్తి విభాగాన్ని ఏర్పాటు చేసింది. పౌల్ట్రీ, డెయిరీ, ఆక్వా రంగ పరిశ్రమలతోపాటు పెంపుడు జంతువులకు అవసరమైన పౌషకాహార పదార్థాలు ఇక్కడ తయారు కానున్నాయి. ట్రౌవ్‌ న్యూట్రిషన్, స్క్రెట్టింగ్‌ బ్రాండ్ల పేరుతో దక్షిణాసియా అవసరాలను ఈ పరిశ్రమ తీర్చనుంది. 
హైదరాబాద్‌ ఫార్మా సిటీలో 50 ఎకరాల్లో లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 
హైదరాబాద్‌లో రూ.1110 కోట్లతో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఫియెట్‌ 
చె్రస్లర్‌ ఆటోమోబైల్స్‌ ప్రకటించింది.  
హైదరాబాద్‌కు చెందిన లక్సై లైఫ్‌ సైన్సెస్‌ అనే ఔషధ కంపెనీ రానున్న రెండు మూడేళ్లలో ఆర్‌ అండ్‌ డీ, టెక్నాలజీ, ఉత్పాదక సామర్థ్యం పెంపు కోసం రూ. 400 కోట్ల పెట్టబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 
అమెరికాకు చెందిన ‘ఫార్చూన్‌ 500’కంపెనీ ‘మస్సాచుసెట్స్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ హైదరాబాద్‌లో రూ. 1,000 కోట్లతో గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ (జీపీసీ)ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 170 ఏళ్ల చరిత్రగల ఈ కంపెనీ అమెరికా వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి జీపీసీ ఇదే కావడం విశేషం. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని వంశీరామ్స్‌ బీఎస్‌ఆర్‌ ఐటీ సెజ్‌లో 1.5 లక్షల చదరపు అడుగుల లీజు స్థలంలో జీపీసీని అభివృద్ధి చేయనుంది. 
రాష్ట్రంలో తమ రెండు ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు రూ. 320 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హిందుస్తా¯Œ  సానిటరీ వేర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. భువనగిరిలో స్పెషాలిటీ గ్లాస్‌ తయారీ కోసం తమ సంస్థ నేతృత్వంలోని ‘ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌’పరిశ్రమలో రూ. 220 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. 2022 నాటికి ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే 4 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.ఇప్పటికే ఈ సంస్థ తెలంగాణలో రూ.1,500–1,600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 15 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో రోజుకు 154 టన్నుల గ్లాసు ఉత్పత్తులు తయారు కానున్నాయి. సంగారెడ్డిలో పైపులు, ఫిట్టింగ్స్‌ తయారీ కోసం హిందూస్థా¯Œ  కంపెనీ మరో రూ.100 కోట్ల పెట్టబుడులు పెట్టనుంది.  
దేశానికి చెందిన ప్రముఖ పాలిస్టర్‌ ఫిల్మ్స్, ఇం జనీరింగ్‌ ప్లాస్టిక్స్, స్పెషాలిటీ పాలిమర్స్‌ తయారీ కంపెనీ ‘ఈస్టర్‌ ఫిల్మ్‌టెక్‌’తెలంగాణలో తమ తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు రూ. 1,350కోట్ల పెట్టబడులు పెట్టనుంది. 800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.  
హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌ కంపెనీ రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. ఇక్కడ కోచ్‌లు, లోకోమోటివ్స్, ఇంటర్‌ సిటీ ట్రైన్‌ సెట్స్, మెట్రో రైళ్లు, మోనో రైళ్లు తయారు కానున్నాయి. ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ కంపెనీ కలిగి ఉండనుంది. ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

10 కొత్త పారిశ్రామిక పార్కులు..
టీఎస్‌–ఐఐసీ 2020–21లో రాష్ట్రంలో 10 కొత్త ఇండస్ట్రియల్‌ పార్కులను అభివృద్ధి చేసి రూ. 6,023 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 453 పరిశ్రమలకు 810 ఎకరాలను కేటాయించింది. న్యూ ఎనర్జీ పార్క్‌ (దివిటిపల్లి), మైక్రో ఇండస్ట్రియల్‌ పార్క్‌ (రాయారావుపేట), ఇండస్ట్రియల్‌ పార్క్‌ మండపల్లి (సిద్దిపేట), ఇండస్ట్రియల్‌ పార్క్‌ (తునికి»ొల్లారం), ఇండస్ట్రియల్‌ పార్క్‌ (జిన్నారం), జనరల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ (శివనగర్‌), ఆగ్రో ప్రాసెసింగ్‌ పార్క్‌ (బండమైలారం), ఆగ్రో ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ (దండుమల్కాపూర్‌), ఆక్వా హబ్‌ (సిరిసిల్ల), ఐటీ పార్క్‌ (ఉస్మాన్‌నగర్‌)లో ఆయా పార్క్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పరిశ్రమలతో 7,623 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 49 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 34 ఎకరాలను కేటాయించింది. 


నంబర్‌ వన్‌ ఫ్యూచర్‌ ఏరో స్పేస్‌ సిటీ 
ఏరో స్పేస్‌ రంగంలో ఉత్తమ రాష్ట్ర పురస్కారాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ అందుకుంది. ఎఫ్‌డీఐ ఏరోస్పేస్‌ సిటీస్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ విభాగంలో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించింది. ప్రముఖ ఏరోస్పేస్‌ కంపెనీ బోయింగ్, సఫ్రాన్‌లు హైదరాబాద్‌లో కొత్త తయారీ యూనిట్లను ప్రకటించాయి.

టీఎస్‌–ఐపాస్‌తో రూ. 2.14 లక్షల పెట్టుబడులు.. 
రాష్ట్ర పారిశ్రామిక విధానం ‘టీఎస్‌–ఐపాస్‌’కింద ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 2.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా 7.71 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.

మరిన్ని వార్తలు