పేదల ‘ఇళ్ల’కు శాశ్వత పరిష్కారం 

29 Sep, 2020 02:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే అంశానికి శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇలాంటి వారిలో ఇప్పటికే కొందరికి 58, 59 జీవోల ద్వారా యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. ఇంకా కొంత మందికి ఈ సమస్య అపరిష్కృతంగా ఉందని, దీనిని శాశ్వతంగా పరిష్కరించేందుకు త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్రమబద్ధీకరించిన ఆస్తుల క్రయవిక్రయాలకు సైతం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకుండా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, పేద ప్రజల ఇళ్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల మంత్రులు, పట్టణ ప్రాంత ఎమ్మెల్యేలతో మున్సిపాలిటీల వారీ గా మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ గ్రామాల కన్నా పట్టణాల్లో ప్రజలు ఆస్తుల యాజమాన్య హక్కుకు సంబంధించిన సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.  

ప్రతి ఇంచ్‌ భూమీ రికార్డుల్లోకి.. 
రాష్ట్రంలోని ప్రతి ఇంచ్‌ భూమినీ ప్రభుత్వ రికార్డులకు ఎక్కించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఆస్తి హక్కులకు భద్రత కల్పించే ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులను ధరణి పోర్టల్‌ డేటాబేస్‌లో నమోదు చేయడం ప్రారంభించిందన్నారు. దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అలాగే పట్టణాల్లో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలన్నారు.

కాలనీల్లో ఎలాంటి భూసమస్యలున్నాయి? ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? సాధ్యమైన పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలపై సూచనలు అందించాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి శాశ్వత పరిష్కా రం చూపుతుందని హామీ ఇచ్చారు. అనం తరం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాల్లో ని పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంగ ళవారం సాయంత్రంలోగా ఆయా పట్టణా లు, కాలనీల్లో ఉన్న ప్రతి సమస్యనూ మున్సి పల్‌ అధికారులకు అందజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు