తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన కేటీఆర్‌ 

27 Jul, 2021 11:00 IST|Sakshi
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

సిద్దిపేట పట్టణ శివారులో ప్రమాదం.. తన కాన్వాయ్‌లోని వాహనాల్లో తరలింపు 

సిద్దిపేటకమాన్‌: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టిన ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను మంత్రి కేటీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణ శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీకి చెందిన జాఫర్‌ (26), యాకూబ్‌ (30) ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి బైపాస్‌రోడ్డు వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. వారిద్దరికి గాయాలయ్యాయి.

అదే సమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ జరిగిన ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపించారు. కాన్వాయ్‌లోని రెండు వాహనాల్లో క్షతగాత్రులిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్‌చేసి చెప్పారు.

మరిన్ని వార్తలు