రాహుల్‌ గాంధీకి పబ్బులు, జల్సాలు మాత్రమే తెలుసు: కేటీఆర్‌

14 May, 2022 15:22 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్‌ పార్టీ, రాహులల్‌ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లాలో జరిగిన హాలియా సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులు భగత్ చేసి చూపిస్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే భగత్‌ కోరిక మేరకు నూతన స్టేడియం కోసం రూ. 3కోట్లు మంజూరు చేస్తున్నాం. ఓపెన్ డ్రైనేజీ కోసం రూ. 15కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

జానారెడ్డి అంటే గౌరవం.. కానీ వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారే చెప్పాలి. పక్కన కృష్ణా నది ప్రవహిస్తున్నా.. ఫ్లోరైడ్ నిర్మూలన చేయలేదు. రైతులకు సాగు నీరు ఇవ్వని అసమర్థులు గత పాలకులు. ఫ్లోరైడ్ నిర్మూలనకు కేసీఆర్ కృషి చేసి చూపించారు. గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప.. అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. పెద్దమనుషుల ఆత్మగౌరవం పెంచిన నేత కేసీఆర్.. బీడీ కార్మికుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ అని అన్నారు.

 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పథకాలు చరిత్రాత్మకం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. మంత్రులుగా సుదీర్ఘంగా పనిచేసినా 6 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వలేదు గత పాలకులు. దేశంలో రైతుల కోసం అనేక పథకాలు ఇచ్చిన ఏకైక నేత కేసీఆర్ మాత్రమే. మనం కట్టే పన్నులు పక్క రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయి. 

ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి ఏం చేశారు.? రాహుల్‌కు ఒక్కసారి  అవకాశమిస్తే ఏం అభివృద్ధి చేస్తారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ. పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏమీ తెలియదు. నాగార్జున సాగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దు. యువనాయకుడు భగత్‌ను కాపాడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉంది’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: అమిత్‌షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ..

మరిన్ని వార్తలు