కూకట్‌పల్లిలో 5 ఎకరాలు ఆక్రమణ

23 Apr, 2022 17:35 IST|Sakshi

ఆయా స్థలాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణం

సీఎంకు లేఖ రాసిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రూ.100 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఆక్రమించేశారు. రాజకీయ, అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లూ జరిగిపోయాయి. రాత్రికి రాత్రే గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయినా స్థానిక మున్సిపల్‌ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవటం విశేషం. ఈ మేరకు కబ్జా రాయుళ్లపై విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. ఆ వివరాలివే..  

► సనత్‌నగర్‌లోని హైదరాబాద్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆస్‌బెస్టాస్‌) తన కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు గృహ వసతి కోసం కూకట్‌పల్లి గ్రామ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 40 ఎకరాలలో ఓపెన్‌ ప్లాట్లకు కేటాయించగా.. 5 ఎకరాలు ఆటస్థలాలు, పార్కులు, స్కూళ్ల వంటి 12 రకాల అభివృద్ధి పనుల కోసం కేటాయించింది. హుడా అనుమతితో ఈ లే–అవుట్‌లో 1,035 ప్లాట్ల చేసి కార్మికుల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేశారు.  

► కొంతకాలం తర్వాత కొందరు కార్మికులు హైదరాబాద్‌ ఇండస్ట్రీస్‌ ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో 45 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి పనుల కోసం కేటాయించిన ఐదెకరాల స్థలంపై కన్నేశారు. స్థానిక రాజకీయ నాయకులు, రిజిస్ట్రేషన్, మున్సిపల్‌ అధికారులతో కుమ్మకై.. 12 ఖాళీ స్థలాల భూమిని 100 ప్లాట్లుగా విభజించి, ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుంది. (క్లిక్‌: రీజినల్‌’ రెండో గెజిట్‌ విడుదల..

► ఆయా అక్రమ రిజిస్ట్రేషన్‌ స్థలాలలో గృహాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జరుగుతున్నా.. మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవటం లేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఆరోపించారు. (క్లిక్‌: మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్ల బ్లాకింగ్‌.. దందాలో పెద్దలు?)

మరిన్ని వార్తలు