బౌన్స్‌ స్కూటీల దొంగ అరెస్ట్‌ 

21 Feb, 2021 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మూసాపేట: పార్కింగ్‌ చేసిన స్కూటీలను దొంగిలించి అమ్ముతున్న దొంగను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. ఔసలి నరేష్‌ (28), శంకర్‌పల్లిలోని మైతాబ్‌ ఖాన్‌గూడలో నివాసముంటున్నాడు. 2018 నుంచి 2020 వరకు బౌన్స్‌ ద్విచక్ర వాహనాల కంపెనీలో టెక్నికల్‌ వింగ్‌లో పని చేసి ఆ తర్వాత మైతాబ్‌ఖాన్‌గూడలో మెకానిక్‌ షెడ్‌ నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి స్టేషన్‌ పరిధిలో 3, కేపీహెచ్‌బీ పరిధిలో 2 వాహనాలను దొంగిలించి తన షెడ్డుకు తరలించాడు.

గతంలో కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో పార్కింగ్‌ చేసిన వాహనాల జీపీఎస్‌ తొలగించి సులువుగా వాహనాన్ని దొంగిలించి తన షెడ్డుకు తరలించేవాడు. మూడు వాహనాలను బౌన్స్‌ స్టిక్కర్‌ తొలగించి, రంగు మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల దొంగిలించిన మరో వాహనానికి జీపీఎస్‌ తొలగించకుండా షెడ్డులో ఉంచి ఊరికెళ్లాడు. డీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎల్లస్వామి, పరమేశ్వర్‌రెడ్డిల నేతృత్వంలో జీపీఎస్‌ ద్వారా మైతాబ్‌ఖాన్‌గూడకు వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకుని నరేష్‌ని రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: జూబ్లీహిల్స్‌: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం

మరిన్ని వార్తలు