టీఎస్‌ బీపాస్‌ ద్వారా ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌

26 Feb, 2023 03:54 IST|Sakshi

ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటే భూ వినియోగపత్రం స్వీకరించే వెసులుబాటు

ట్విట్టర్లో ప్రకటించిన స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: నగరాలు, పట్టణాల్లో భూములను కొనుగోలు చేసిన వారికి ఉపయో గపడేలా ల్యాండ్‌ యూజ్‌ స్టేటస్‌ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ అందుబాటు లోకి తెచ్చింది. భూ కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన భూమి మాస్టర్‌ ప్లాన్‌లోని ఏ కేటగిరీ పరిధిలో ఉందో టీఎస్‌–బీపాస్‌ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది.

ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌ (భూమి వినియోగ పత్రం)ను టీఎస్‌–బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కొని, నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికెట్‌ పొందే వీలును మున్సిపల్, పట్టణ పరిపాలన శాఖ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ లాండ్‌ యూజ్‌ సర్టిఫి కెట్‌ పొందే తీరును ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

తమకు అవస రమైన సేవలు కావాల్సిన వారు https://lui. tsbpass.telangana.gov.inతమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే నంబర్‌ నమోదు చేసి, తగిన రుసుము చెల్లిస్తే ఆ భూమికి సంబంధించిన ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ సర్టిఫికెట్‌ పొందే సేవలు అందుబాటులో ఉన్నాయి.  
 

మరిన్ని వార్తలు