ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ ప్రారంభం

16 Dec, 2022 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ పోషకాహార లోపం లేని తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమన్నారు. దాదాపుగా 30 లక్షల మంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం నడుం బిగించిందని వివరించారు. ఆధునిక సాంకేతికత తో ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్లాంట్ ఆసియాలోనే ఇదే అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం  తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో సంస్థ ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ 1975 లో నిర్మించింది కాబట్టి రానున్న భవిష్యత్ దృష్యా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటలకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి  జరగనుందని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఈ నూతన ప్లాంట్ ద్వారా ఇప్పుడు సరఫరా చేస్తున్న మన రాష్ట్రం, ఏపీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు మనం పోషకాహారం అందించవచ్చన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రానున్న మరో 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరం మేర పోషకాహారం ఉత్పత్తి జరుగుతుందన్నారు. అంతే కాకుండ సివిల్ సప్లై వారికి అందించే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉత్పత్తి చేసి అందించే సామర్ధ్యం నూతన ప్లాంట్‌కు ఉందన్నారు.

సంస్థ ఉత్పత్తి చేసే బాలామృతం, బాలామృతం+, స్నాక్స్ వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లోని 35,699 అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అదే విధంగా ఏపీలోని 55,605 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పోష్టికాహారం అందుకుంటున్నారని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు 20 శాతం వేయిజేస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి నోటీసులు

మరిన్ని వార్తలు