చర్లపల్లి జైలు స్పెషల్‌ బ్యారెక్‌లో రాజాసింగ్‌.. పీడీ యాక్ట్‌ రివోక్‌పై లాయర్ల ప్లాన్‌ ఫలిస్తుందా?

27 Aug, 2022 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రాజాసింగ్‌కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలులో ఉగ్రవాద ఖైదీలున్న నేపథ్యంలో రాజాసింగ్‌ను ప్రత్యేక బ్యారెక్‌లో వసతి ఏర్పాటు చేశారు. 

ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను రివోక్‌ చేసేందుకు ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రాజాసింగ్‌ అరెస్ట్‌లో పీడీ యాక్ట్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్‌ ప్రపోజర్స్‌ను అడ్వైజరీ బోర్టు కమిటీ పరిశీలించనుంది. నెలలోపు రాజాసింగ్‌ను అడ్వైజరీ కమిటీ విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను ఆయన లాయర్లు ములాఖత్‌ ద్వారా ఇప్పటికే కలిశారు. కాగా, పీడీ యాక్ట్‌ నమోదైన వ్యక్తులు మూడు నెలలు లేదా ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లలో పోలీసులు.. 2,573 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్టు సమాచారం. 

మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్‌ కొనసాగుతోంది. రాజాసింగ్‌ అభిమానులు, హిందూ సంఘాలు.. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. ఇక, భైంసాలో బంద్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: పవర్‌ఫుల్‌ పీడీ యాక్ట్‌.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏడాది జైల్లోనే! 

మరిన్ని వార్తలు