Bheemeshwari- Naveen: కన్నీరు పెట్టిస్తున్న ప్రేమకథ.. అనాధగా పసిబిడ్డ

22 Aug, 2022 15:09 IST|Sakshi

సాక్షి, నారాయణపేట: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పేదరికం వెంటాడుతున్నా ఇరు కుటుంబాలకు దూరంగా వెళ్లి బతుకు బండిని సాగిస్తున్నారు. అంతలోనే విధి వక్రీకరించింది. ఓ పాపకు జన్మనివ్వగానే ఆ తల్లి కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేని భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టిన పసిబిడ్డ అనాధ అయ్యింది.

వివరాల్లోకెళ్తే.. నారాయణ పేట జిల్లా మఖ్తల్‌కు చెందిన నవీన్‌, అదే గ్రామానికి చెందిన భీమేశ్వరి ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్తే వారు పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా భీమేశ్వరి 2021 మేలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి రెండు నెలలకే నవీన్‌కుమార్‌తో వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఇద్దరూ కుటుంబ సభ్యులకు దూరంగా హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉంటున్నారు. ఆగస్టు 18న భీమేశ్వరి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు రాత్రి ఓ పాపకు జన్మనిచ్చిన భీమేశ్వరి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్‌ సంజీవయ్య పార్కు వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టిన పసిబిడ్డ అనాధగా మారింది.

చదవండి: (కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం)

మరిన్ని వార్తలు