మైనర్‌ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!

30 Mar, 2021 12:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యువతి మృతి..

మృత్యువుతో పోరాడుతున్న యువకుడు   

వరంగల్‌ : ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు, వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ కుటుంబం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో కొంతకాలంగా నివాసముంటోంది. ఇదే జిల్లా గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ  మైనర్‌ బాలికను ప్రేమలోకి దింపాడు.

వీరి విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఈనెల 27న నెక్కొండ వట్టెవాగు సమీపాన ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రేమ జంట పురుగుల మందు తాగి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి సోమవారం ఉదయం మృతి చెందగా, యువకుడు మృత్యువుతో పోరాడుతున్నట్లు సమాచారం. దీనిపై ఎస్సై నాగరాజును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.   

మరిన్ని వార్తలు