రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన

14 Sep, 2020 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ(సోమవారం) ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేగాక దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని అధికారులు చెప్పారు. దీంతో తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న చత్తీష్‌గడ్‌ ప్రాంతాలలో 0.9కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన
తీవ్ర అల్ఫపీడనం కారణంగా రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్‌, కోమురంభీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్–పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురివగా బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు