ఘర్షణకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

26 Mar, 2021 15:29 IST|Sakshi
ఇంట్లో వస్తువులను పగులగొట్టిన దృశ్యం

సాక్షి, మహబూబాబాద్‌‌ : ఆ బాలిక మైనర్‌.. ఓ యువకుడు ఆమెను ప్రేమించాడు. పెద్దలు మందలిస్తారనే భయంతో వారు పరారు కాగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడిచేసి ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసం చేశారు. అలాగే, యువకుడి మేనమామపై కత్తి, కర్రలతో దాడిచేసి హత్యాయత్నానికి యత్నించారు. మహబూబాబాద్‌ జిల్లా రేగడితండాలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. కురవి ఎస్సై జె.శంకర్‌రావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగడితండాకు చెందిన డిగ్రీ చదివే 20 ఏళ్ల యువకుడు తమ ఎదురింట్లో ఉండే ఏడో తరగతి చదువుతున్న బాలికతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు.

ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడిచేసి ఇంట్లోని సామగ్రి కాకుండా వారి వ్యవసాయ భూమి వద్ద రూ.3 లక్షల విలువైన బోర్‌ మోటార్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో యువకుడి తల్లిదండ్రులు కూరగాయలు అమ్మేందుకు మహబూబాబాద్‌కు వెళ్లగా ఘటన విషయం తెలుసుకుని వచ్చే సరికి ఇంట్లోని 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరణకు గురయ్యాయని ఆరోపించారు. ఇక యువకుడి మేనమామ ప్రజాప్రతినిధులకు తెలపగా వారు మాట్లాడేందుకు కూర్చున్నారు. పెద్దమనుషులు మాట్లాడుతుండగానే యువకుడి మేనమామ బానోతు వీరన్నపై బాలిక బంధువులు కర్రలతో దాడిచేసి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కాగా, ప్రేమ విషయంలో యువకుడు గత ఏడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. 

చదవండి: 
వ్యభిచార గృహంపై దాడి: నలుగురి అరెస్ట్‌
ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు..

మరిన్ని వార్తలు