పెద్ద మనసు చాటుకున్న పేద కుటుంబం

4 Apr, 2021 07:56 IST|Sakshi
రాములు (ఫైల్‌ ఫొటో)

కుటుంబ సభ్యుడికి బ్రెయిన్‌ డెడ్‌ 

దుఃఖం దిగమింగుకొని అవయవదానానికి అంగీకారం 

చాదర్‌ఘాట్‌: అనుకోని అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు బ్రెయిన్‌డెడ్‌కు గురై పుట్టెడు దుఃఖంలో ఉండికూడా ఆ పేద కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అతని అవయవదానానికి ఒప్పుకోవటం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కష్ణయ్య, సత్తెమ్మ దంపతుల రెండవ కుమారుడు రాములు (24) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.

గత గురువారం ఉదయం పనికి వెళ్లటానికి సిద్ధం అవుతుండగా అనుకోకుండా అతని కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. హుటాహుటిన అతడ్ని మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆలోపే అతని గొంతు కూడా మూగబోయింది.

అతడికి అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాములుకు బ్రెయిన్‌డెడ్‌ అయిందని, బతికే అవకాశాలు లేవని నిర్ధారించారు. దాంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అవయవదానంపై ఆసుపత్రి వైద్యులు వారికి తెలియజేసి అవగాహన కలి్పంచారు. దాంతో రాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆసుపత్రికి వచ్చి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

మరిన్ని వార్తలు