అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

24 May, 2023 17:03 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేష్(24) అమెరికాలో మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో మృతి చెందాడు.

వివారాలు.. బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేసి.. 4 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్‌ఎస్‌ చేస్తున్నాడు.మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు.


కొడుకు మృతి వార్తతో విలపిస్తున్న తండ్రి రాములు,

మహేష్ తండ్రి బోయ వెంకట్ రాములు మహారాష్ట్రలో కాంట్రాక్టర్‌ వద్ద సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గ్రామంలో విషాదచ్చాయలు అలముకున్నాయి. మహేశ్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు..

మరిన్ని వార్తలు