డ్రగ్స్‌ ఎమ్మెల్యేలు, వసూల్‌ మంత్రిని తొలగించండి

9 Apr, 2021 16:17 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్ అధికార మదంతో అక్రమాలతో దుష్ట పాలన సాగిస్తోందని.. కళ్లు నెత్తికెక్కి మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూల్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

డ్రగ్స్‌ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు తెలిపారని ఉత్తమ్‌ చెప్పారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు భూమి, ఇసుక, మద్యం డీల్ చేయగా ఇప్పుడు డ్రగ్స్ దందాలో కూడా వేలు పెట్టారని తెలిపారు. కర్ణాటకలో బీజేపీతో మాట్లాడుకొని కేసును మాఫీ చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన ఉందని, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తిని పోటీలో పెట్టిందని వివరించారు. సాగర్‌కు నీళ్లు రావు.. ఎడారిగా మారుతోందనే విషయం ఓటర్లు గమనించాలని సూచించారు. టీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సాగర్ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని సందేహం వ్యక్తం చేశారు. డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ కర్ణాటకలో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారు అని నిలదీశారు.

చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు
చదవండి: ‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య

మరిన్ని వార్తలు