అంబేడ్కర్‌తో కేసీఆర్‌కు పోలికా?  

20 Sep, 2022 03:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినవ అంబేడ్కర్‌గా పోలుస్తూ సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించడమేనని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పినందుకు ఆయన్ను కలెక్టర్‌ అభినవ అంబేడ్కర్‌ అన్నారా? అని సోమవారం ఒక ప్రకటనలో మల్లు రవి ఎద్దేవా చేశారు.

రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా ఎనిమిదేళ్లుగా మోసం చేసినందుకు ఆయన అభినవ అంబేడ్కర్‌ అవుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చేసినందుకు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదోవ పట్టించినందుకు కేసీఆర్‌ అభినవ అంబేడ్కర్‌ అయ్యారా అని నిలదీశారు. సంగారెడ్డి కలెక్టర్‌ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు