HYD: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు

27 May, 2023 13:26 IST|Sakshi

సాక్షి, పహాడీషరీఫ్‌: మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనలో స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన పూరన్‌ సింగ్‌గా గుర్తించారు. కాగా, పూరన్‌ సింగ్‌పై మృతిలో కీలక ట్విస్ట్‌ చోటుచేసుకుంది. పూరన్‌ సింగ్‌ భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతికి జయదేవీ అనే మహిళే కారణమని చెప్పుకొచ్చారు. 

వివరాల ప్రకారం, పూరన్‌ సింగ్‌ మృతిపై తాజగా ఆయన భార్య మమతా సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జయదేవీ తనను పెళ్లి చేసుకోవాలని నా భర్త వెంట పడుతోంది. ఆయన్ను వేధింపులకు గురిచేసింది. నన్ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను గత కొద్దిరోజులుగా బెదిరిస్తోంది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. నా భర్తను జయదేవీనే కిరాతకంగా చంపేసింది. పూరన్‌ సింగ్‌ను ట్రాప్‌ చేసి ప్లాన్‌ ప్రకారమే హత్య చేసింది అని కామెంట్స్‌ చేశారు. 

అంతకు ముందు, ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న సాయంత్రం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పరిసర పోలీస్‌స్టేషన్లలో అదృశ్యమైన కేసులను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన దీన్‌ దయాళ్‌ కుమారుడు పూరన్‌సింగ్‌ (30) హైదరాబాద్‌కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్‌నగర్‌లో పానీపూరి బండి నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

ఈ నెల 22న రాత్రి 10 గంటలకు బార్కాస్‌లోని వివాహానికి హాజరవుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడం.. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో అతని భార్య మమతా సింగ్‌ 23న రాత్రి 7 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మృతుడి వివరాలు తెలియరావడంతో పూరన్‌సింగ్‌కు ఉన్న విబేధాల విషయమై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ హత్యలో కీలక పరిణామం

మరిన్ని వార్తలు