ప్రేమ వివాహం.. భర్త వేధింపులు.. చివరకు..

6 Aug, 2021 18:12 IST|Sakshi
పల్లా రాంబాబు (ఫైల్‌)

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): పట్టణంలోని జేకే సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్న టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ పల్లా రాంబాబు(35) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం సూర్యాపేట. 2007లో నియామకమైన ఇతను తొలుత ఇల్లెందులో, ఆ తర్వాత కొత్తగూడెం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించాడు. గత ఆరు నెలలుగా డ్యూటీకి గైర్హాజరవుతున్నాడు. మద్యానికి బానిసగా మారి తనను వేధిస్తున్నాడని భార్య రుబీనా రెండు రోజుల కిందట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తాను నివాసం ఉంటున్న మామ బుగ్గ సరయ్య పేరుతో ఉన్న ఎస్‌డీ–260 క్వార్టర్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే..అతడి మరణం తర్వాత భార్య, అత్తమామలు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని మృతుడి సోదరుడు ప్రవీణ్, సోదరి జ్యోతి ఆరోపించారు. రుబీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, బీఈడీ చదివించి టీచర్‌ ఉద్యోగం వచ్చేలా కృషి చేశాడని తెలిపారు. పాప, బాబు ఉన్నారని, మద్యానికి బానిసగా మారి..గొడవలు జరుగుతున్నాయని, కేసు నమోదుతో మనస్తాపంతో చెంది ఉంటాడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యులు గురువారం ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని..పోస్టుమార్టమ్‌ అనంతరం మృతదేహాన్ని తరలించేలా చూశారు.

మరిన్ని వార్తలు