యజమాని కొట్టాడని జంప్‌.. తిరిగి వచ్చేసరికి తనకు అంత్యక్రియలు, అంతా షాక్‌!

6 Nov, 2021 12:25 IST|Sakshi

కుళ్లిపోయిన స్థితిలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబీకులు 

అదృశ్యమైన వ్యక్తి  ఇంతలోనే రావడంతో అంతా అవాక్కు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఘటన

చర్ల (భద్రాద్రి కొత్తగూడెం): కుటుంబ సభ్యుడు ఒకరు అదృశ్యమయ్యాడు.. ఇంతలోనే గుర్తు పట్టలేని స్థితి మృతదేహం లభించింది. తమ వాడేనని ఆ కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. ఇది జరిగిన 12 గంటలకు సదరు వ్యక్తి గ్రామంలో ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా గ్రామంలోనే ఓ వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల యజమాని.. ప్రసాద్‌ను కొట్టాడు. తర్వాత చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అయితే, కొన్ని రోజులకు డ్రైవర్‌ ప్రసాద్‌ అదృశ్యం కాగా.. ఆయన తల్లి ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే ఈనెల 3న తాలిపేరు ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఈ మృతదేహాన్ని గురువారం వెలికితీసి ప్రసాద్‌ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
(చదవండి: Jubilee Hills: డ్రస్సింగ్‌ రూంలో మహిళల న్యూడ్‌ వీడియోలు చిత్రీకరణ)

అప్పటికే కుళ్లిన స్థితిలో ఉండటంతో అది ప్రసాద్‌దిగానే భావించి రాత్రి ప్రాజెక్ట్‌ సమీపానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసాద్‌ పనిచేసిన ట్రాక్టర్‌ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం ప్రసాద్‌ చర్లలో ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అవాక్కయ్యారు. ట్రాక్టర్‌ యజమాని మళ్లీ కొడతాడేమోననే భయంతో తాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నట్లు వివరించాడు. కాగా, రిజర్వాయర్‌లో ప్రత్యక్షమైన మృతదేహం ప్రసాద్‌ది కాదని తేలడం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరినో హత్య చేసినట్లు భావిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: ప్రయాణికులకు బస్సు డ్రైవర్‌ షాక్‌.. ఏం చేశాడంటే..!)

మరిన్ని వార్తలు