పొరపాటుగా అకౌంట్‌లో రూ.2 కోట్లు.. వ్యక్తి ఏం చేశాడంటే..

23 Feb, 2022 15:02 IST|Sakshi
సాబూ ఆటోజోన్‌ జీఎంకు రూ.2కోట్ల చెక్కు అందజేస్తున్న వెంకటేశ్వర్లు (ఎడమ)

సాక్షి, వైరా(ఖమ్మం) : ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటుగా రూ.2 కోట్ల నగదు జమ కాగా.. తిరిగి జమ చేసిన కంపెనీకి అప్పగించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన గంధం వెంకటేశ్వర్లు ఖాతాలో ఈనెల 11న రూ.2 కోట్లు జమ అయినట్లు సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆయన ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చూడగా ఖాతాలో రూ.2కోట్లు జమ అయి ఉన్నాయి. కాగా, వెంకటేశ్వర్లు వైరా తహసీల్‌ ఎదుట నిర్మించిన భవనంలో సాబూ ఆటో జోన్‌ కంపెనీ(అశోక్‌ లేలాండ్‌ కంపెనీ) డీలర్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు.

నెలనెలా సదరు డీలర్‌ వెంకటేశ్వర్లుకు ఇంటి అద్దెను బ్యాంకు అకౌంట్‌లో జమ చేసేవాడు. ఈక్రమంలోనే పొరపాటున కంపెనీకి చెల్లించాల్సిన రూ.2కోట్లను ఈయన ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ జీఎం శేషాచారి వైరాకు చేరుకోగా.. అప్పటికే వెంకటేశ్వర్లు డీలర్‌తో చర్చిస్తున్నాడు. దీంతో మంగళవారం ఖమ్మంలోని రోటరీనగర్‌ ఎస్‌బీఐ శాఖ ద్వారా ప్రతి నిధులకు రూ.2కోట్ల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు అభినందించారు.  

మరిన్ని వార్తలు