అగర్‌ బత్తీ కంపెనీ పేరుతో రూ.85 లక్షలు స్వాహా

14 Apr, 2022 16:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: అగర్‌బత్తీల తయారీ కంపెనీ ఏర్పాటు చేద్దామంటూ నమ్మించి మంగళ్‌హాట్‌కు చెందిన ఒక మహిళను ఓ గ్యాంగ్‌ రూ. 85 లక్షలు మోసం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన బిరదర్‌ ఉమా కు, తన మేనల్లుడు రాజ్‌కుమార్‌ ద్వారా శ్రీకాంత్, భీమా, శశిధర్‌ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. అగర్‌బత్తీల కంపెనీ ఏర్పాటు చేద్దామని దానికి సంబంధించిన లైసెన్స్‌లు, యాంత్రాలు తెప్పిస్తామని నమ్మించారు.  మున్నా సింగ్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అరంఘార్, దూల్‌పేట్‌లోని ప్యాక్టరీ పెట్టేందుకు స్థలాన్ని అగ్రిమెంట్‌ చేసుకోవాలని ఒప్పించారు.

ఆ తరువాత సంగమేశ్వర ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే పేరుతో లైసెన్స్‌ తెప్పించారు, దానికి బాధితురాలు అంగీకరించలేదు. తన పేరుతోనే లైసెన్స్‌ కావాలని స్వయంకృషి ఇండస్ట్రీస్‌ పేరుతో లైసెన్స్‌ దరఖాస్తు చేసింది. వీటన్నింటికి లక్షల రూపాయలలో డబ్బులు తీసుకొని రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారు.  అలాగే తన మేనల్లుడైన రాజ్‌కుమార్‌ వద్ద కూడా యంత్రాల కోసం డబ్బు తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. 85 లక్షల వరకు తమ వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారంటూ బాధితురాలు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు