దారుణం..మరణానికి ముందే శ్మశానవాటికకు.. 

28 Apr, 2022 03:23 IST|Sakshi

తీసుకెళ్లిన కొద్దిగంటల్లోనే మృతిచెందిన లక్ష్మణాచారి

ఇంటి ఓనర్‌తో ఇబ్బందులొద్దనే తీసుకెళ్లామన్న తల్లిదండ్రులు

వెంకటాపురం(ఎం): బతికి ఉండగానే ఓ వ్యక్తిని శ్మశానవాటికకు తరలించారు. విషయం తెలుసు కున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ఆస్పత్రికి తరలించాలనుకునేలోపే మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం)లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కేసోజు సోమయ్యచారి, సరోజనలు స్థానికంగా ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి రెండవ సంతానమైన లక్ష్మణాచారి మద్యానికి బానిసయ్యాడు. విసుగు
చెందిన అతని భార్య రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది.

6 నెలల క్రితం లక్ష్మణాచారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి లక్ష్మణాచారి మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇంట్లో మృతి చెందితే యజమాని ఏమైనా అంటాడనే భయంతో తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున శ్మశానవాటికకు తరలించారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై రాధిక, సర్పంచ్‌ మేడబోయిన అశోక్‌లు శ్మశానవాటికకు చేరుకొని లక్ష్మణాచారిని ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. అయితే ఈలోపే అతడు మృతి చెందాడు. అద్దె ఇంట్లో కొడుకు చనిపోతే ఇంటి యజమానితో ఇబ్బందులు ఉంటాయనే శ్మశానవాటికకు తరలించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.  

మరిన్ని వార్తలు