6 రోజుల నిరీక్షణ.. అంతయ్య మృతదేహం లభ్యం

9 Aug, 2021 13:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య  మృతదేహం ఎట్టికేలకు లభ్యమైంది. గల్లంతైన మృతదేహం కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 6 రోజుల తర్వాత అంతయ్య మృతదేహం బయటపడింది. కాగా గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. 

6 రోజుల నిరీక్షణ అనంతరం..
బెంగుళూరుకు చెందిన అజంతా సొల్యూషన్స్ టెక్నాలజీ వారి నూతన టెక్నాలజీ కెమెరా పరికరాలతో మొదటగా ట్రంక్ లైన్ లో గుర్తించగా కొద్దిసేపటికే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ వద్దకి మృతదేహాం వచ్చి ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మృతదేహాన్ని బయటకు తీసే పనిలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందితో బయటకు తీయిస్తున్నారు. అంతయ్య కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని,  మృతికి కారణమైన అధికారులని శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాగా ఎల్‌బీ నగర్‌ పరిధిలోని సాహెబ్‌ నగర్‌లో డ్రైనేజీ క్లీనింగ్‌ కోసం మ్యాన్ హోల్‌లో దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. మొదట ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం ఆ రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం నాడు దొరికింది. 
 


 

మరిన్ని వార్తలు