భూ సమస్య పరిష్కారానికి పాదయాత్ర

23 Apr, 2022 03:05 IST|Sakshi

సీఎంను కలిసేందుకు బయల్దేరిన శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, మంచిర్యాల: తన భూ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు మంచిర్యాలకు చెందిన జనగాం శ్రీనివాస్‌గౌడ్‌(58) పాదయాత్ర ప్రారంభించాడు. ఫ్లెక్సీపై వివరాలు రాసి మెడకు తగిలించుకుని కాలినడకన మంచిర్యాల నుంచి శుక్రవారం బయల్దేరాడు. మందమర్రి మండలం తిమ్మాపూర్‌ శివారులో శ్రీనివాస్‌గౌడ్‌కు 15ఎకరాల భూమి ఉంది. 1992 వరకు పట్టా భూమిగా, తర్వాత లావుణి పట్టాగా పహానిలో నమోదైంది.

2016 భూ ప్రక్షాళనలో 15 ఎకరాలకు బదులు 13.2 ఎకరాలుగా 2018లో పాస్‌బుక్‌లు ఇచ్చారు. తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పలుమార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఎండలో నడవడానికి వయసు సహకరించకున్నా రెవెన్యూ శాఖ తప్పిదాలను ఎత్తి చూపేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నాడు. ఈ విషయమై మందమర్రి ఎమ్మార్వో సంపతి శ్రీనివాస్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, గతంలోనే ఆయనకు అసైన్‌మెంటు కింద పట్టా జారీ అయిందని, ఇప్పుడు మార్చడం వీలుకాదని తెలిపారు.

మరిన్ని వార్తలు