మంచిర్యాల: వందకు పైగా సంచుల్లో చిల్లరతో షోరూమ్‌కి.. ఎట్టకేలకు వెంకటేశ్‌ హ్యాపీ

10 Dec, 2022 08:44 IST|Sakshi

మంచిర్యాల: జిల్లా కేంద్రం పరిధిలోని కోల్‌బెల్ట్‌ ఏరియాలో నివసించే ఒక యువకుడు చేసిన పని.. ఓ బైక్‌ షోరూం నిర్వాహకులకు షాకిచ్చింది. ఏకంగా వందకు పైగా సంచుల్లో నాణేలు ఇవ్వడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తన కలల బైక్‌ను సొంతం చేసుకోవడానికే తాను ఈ డబ్బుతో వచ్చానని చెప్పడంతో వాళ్లు కంగుతిన్నారు. 

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ తారకరామ కాలనీకి చెందిన వెంకటేశ్‌.. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేశాడు. స్పోర్ట్స్‌ బైక్‌పై తిరగాలన్నది అతని కోరిక అట. అందుకోసం దాచుకున్న చిల్లర డబ్బును తీసుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బైక్‌ షోరూంకి వెళ్లాడు. 112 సంచు(సీల్డ్‌ కవర్లు)ల్లో తెచ్చిన చిల్లరను చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. అయితే.. చిల్లరంతా లెక్కించిన తర్వాతే బైక్‌ అందిస్తామని వాళ్లు తెలిపారు. ఆపై.. పదిహేను మంది సిబ్బంది గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నాణేలు లెక్కించారు. 

రూ.2.85 లక్షల రూపాయి విలువగా తేలడంతో.. విలువైన స్పోర్ట్స్‌ బైక్‌ను వెంకటేశ్‌కు అందించారు. పోగు చేసిన చిల్లరతో  తన డ్రీమ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ దక్కించుకోవడంతో వెంకటేశ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు