జడ్చర్ల/ నాగర్కర్నూల్ రూరల్: సీఎం కేసీఆర్, చినజీయర్స్వామి దళిత వ్యతిరేకులని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ సాధ్యమైందని ఒకప్పుడు పొగిడిన కేసీఆర్ ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మొదటి నుంచి అంబేడ్కర్పై వివక్ష చూపిస్తూ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలని కుట్ర చేస్తున్నారన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కోవింద్ను ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు. రామానుజాచార్యుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చినజీయర్స్వామి వ్యవహరిస్తున్నారని, ఆధ్యాత్మికత ముసుగులో ‘రియల్’వ్యాపారవేత్తగా మారారని విమర్శించారు.