‘యాంకర్‌ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’

31 Aug, 2020 12:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 139 మంది అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలికి అండగా నిలిచిన వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలు సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖ యాంకర్‌ ప్రదీప్ మాచిరాజు‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నారు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై‌ బాధితురాలు కేసు పెట్టిందని తెలిపారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఘటన చూస్తే పూలన్ దేవి గుర్తొచ్చింది. ఫూలన్ దేవి ఎన్నోసార్లు అఘాయిత్యానికి గురయ్యారు. పీడిత కులానికి చెందిన యువతిపై 139 దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులను మా బృందం సంప్రదించింది. ఒక మహిళా ఏసీపీ కేసును విచారిస్తున్నరని తెలిపారు. కేసును సీఐడీకి బదిలీ చేయాలని కోరుతున్నాం. నిన్న సుమారు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడాను. 139 మందిపై రేప్ కేసుతో పాటు ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు. మా జోలికి అనవసరంగా వస్తే వదిలి పెట్టం. ఈ కేసులో నిజాలు తెలుసుకునేందుకు బాధితురాలికి పోలీసుల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాను. పెళ్లైన తరువాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు ఘటనలు వివరించింది. 139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. ఇంకో 30 శాతం అమ్మాయిని మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారు.
(చదవండి: ఎవరీ డాలర్‌ బాయ్‌?)

దాదాపు 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేని వాళ్లు ఉన్నారు. అమ్మాయి చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ కు గురై అత్యాచారానికి గురైంది. ఎస్‌ఎఫ్‌ఐ మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్‌కు గురైంది. డాలర్ బాయ్‌ అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. డాలర్ బాబు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మీసాల సుమన్, డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయట పడుతాయి. బాధితురాలికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలి’ అని మందకృష్ణ పేర్కొన్నారు.
(చదవండి: 143 మంది అత్యాచారం కేసు: స్పందించిన ప్రదీప్‌)

మరిన్ని వార్తలు