‘తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంబం లాభపడింది’

20 Sep, 2020 16:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ తెలిపారు. మనిక్కమ్ ఠాగూర్ ఆదివారం  మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్యెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంభం లాభపడిందని, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదని ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ నాయకులు ఎవరి స్థాయిలో వారు టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని తెలిపారు. కాగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఇన్‌చార్జి మనిక్కమ్ ఠాగూర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు  పార్టీ అభివృద్ధి కోసం అభిప్రాయాలు, సూచనలు చేశారు.  అయితే ప్రధానంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అసెంబ్లీ అభ్యర్థులకు ప్రచారం చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని నాయకులు కోరారు.

ప్రాంతీయ పార్టీతో ఇక్కడ పోరాటం చేస్తున్న పీసీసీ అధ్యక్షులకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.  క్రమశిక్షణ, సామాజిక మాధ్యమం వ్యక్తిగత ప్రచారాల విషయంలో నాయకత్వం కొంత కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. టీఆర్ఎస్ నాయకత్వం డబ్బులు, అధికారిక దుర్వినియోగం చాలా చేస్తుందని కాంగ్రెస్ నాయకత్వాన్ని కింది స్థాయి నుంచి ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పారు. నాయకులు సూచించిన విషయాలపై మనిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పాలనకు పదేళ్లు పూర్తవుతుందని వారి పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టిన కాంగ్రెస్ గెలుస్తుందని భయపడాల్సిన అవసరం లేదని నాయకులకు మనిక్కమ్ భరోసా కల్పించారు. 

కింది స్థాయి నుంచి అన్ని అంశాలలో పోరాటం చేయాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో కలిసి పనిచేయాలని, సామాజిక ప్రాధాన్యాన్ని కచ్చితంగా పాటిస్తామని అన్నారు.  అయితే అన్ని అంశాలలో కింది స్థాయి నుంచి పోరాటం చేయాలని తెలిపారు.  క్రమశిక్షణతో నాయకులు కలిసి పనిచేయాలని, సామాజిక ప్రాధాన్యాన్ని కచ్చితంగా పాటిస్తామని తెలిపారు. పార్టీకి అధికారం కంటే ప్రజల అవసరాలను గుర్తించడమే ముఖ్యమని, అందుకే ప్రజల కొరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఆమెకు బహుమతిగా ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం మీద కలిసికట్టుగా పోరాటాలు చేసి విజయం సాధించే దిశగా, అందరూ కృషి చేయాలని మనిక్కమ్ ఠాగూర్ పిలుపునిచ్చారు
 

మరిన్ని వార్తలు