పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు

19 May, 2021 09:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తూప్రాన్‌: పెళ్లికి పురోహితుడిగా ఉండి వధువుకు కట్టించాల్సిన తాళిబొట్టును దొంగగా మారి కొట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. అప్పటికి మంగళసూత్రం దొరక్క పసుపుతాడుతో పెళ్లి జరిపించేశారు. అంతా సద్దుమణిగాక పెళ్లి వీడియోలో ఈ పురోహితుడి ఘనకార్యం బయటపడింది. పడాలపల్లికి చెందిన మున్‌రాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్‌దాస్‌కు నర్సాపూర్‌ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న తూప్రాన్‌లో గజ్వేల్‌కు చెందిన పురోహితుడు చరణ్‌శర్మ వివాహం జరిపించారు.

అయితే పెళ్లి వేడుకలో వధువుకు కట్టించాల్సిన తాళిబొట్టు ముహూర్తం సమయానికి కనిపించకపోవడంతో పసుపుతాడుతో పెళ్లి కానిచ్చేశారు. రూ.1.50 లక్షల విలువ చేసే 3 తులాల బంగారు మంగళసూత్రం ఏమైందన్న విషయాన్ని తెలుసుకునేందుకు పెళ్లిలో రికార్డయిన వీడియోను కుటుంబ సభ్యులు చూశారు. అందులో పురోహితుడే మంగళసూత్రాన్ని తన జేబులో వేసుకుంటున్న దృశ్యాలు కన్పించాయి. దీంతో బాధితులు అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఓ జ్యువెలరీ దుకాణంలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు. 
చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్‌ ఫిర్యాదు 

మరిన్ని వార్తలు