3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు.. అందరి దృష్టిని మళ్లించడానికే

15 Feb, 2023 12:39 IST|Sakshi

సాక్షి,మెదక్‌ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్‌పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే  ఆ బైక్‌ , ఇద్దరి చెప్పులు  మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదైంది.

సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు,  బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు.

పోలీసులు  గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్‌ఐ నర్సింలు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు