సాక్షి పరిశోధన: హౌసింగ్‌ సొసైటీల్లో రాబందులు

23 Aug, 2021 08:37 IST|Sakshi

భారీగా అక్రమాలు.. వేల కోట్లలో దందా 

లబ్ధిదారుల నోట్లో మట్టికొట్టి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్న తీరు 

టీఎన్‌జీవోస్‌ మొదలుకొని చిత్రపురి వరకు ఇదే పరిస్థితి 

58 సొసైటీలకు సర్కారు ఇచ్చిన భూమి 4,297 ఎకరాలు 

ఇందులో అక్రమార్కుల చేతుల్లో ఉన్నది 500 ఎకరాలు 

ఫిర్యాదులు వస్తున్నా నామ్‌కేవాస్తేగా విచారణలు 

ప్లాట్లు ఎరవేసి కొందరు అధికారులనే కొనేసిన తీరు 

వారంతా ఉద్యోగులు, కళాకారులు.. సమాజానికి ఎంతోకొంత సేవ చేస్తున్న వివిధ రంగాల వారు.. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు హౌజింగ్‌ సొసైటీలుగా ఏర్పడ్డారు.. ప్రభుత్వం నామమాత్రపు ధరకు కొంత భూమి ఇచ్చింది ఇంకేం.. ఇంటి జాగాలో, ఫ్లాట్లో వస్తాయని వారంతా సంబరపడ్డారు కానీ కొందరు సొసైటీల పెద్దలు కక్కుర్తి పడ్డారు.. రాజకీయ నేతలు గద్దల్లా వాలిపోయారు.. డబ్బున్న వాళ్లు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలూ కన్నేశారు.. అర్హులకు అందాల్సిన స్థలాలు, ఫ్లాట్లు అంగట్లో సరుకైపోయాయి అవసరమున్నోళ్లకు అందకుండా ఎవరెవరి చేతుల్లోకో వెళ్లిపోయాయి ...రాష్ట్రంలో హౌజింగ్‌ సొసైటీల బాగోతమిది.

ఈ అక్రమాలతో ఒకటీ రెండెకరాలు కాదు.. ఐదారు వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. కొన్నిచోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సొసైటీల్లోని కీలక వ్యక్తులు బినామీ పేర్లతో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం.. తమ బంధుగణం, స్నేహితులు, దగ్గరివారి నుంచి లక్షల రూపాయలు తీసుకొని అమ్మేసుకుంటున్నారు. దీంతో అసలైన లబి్ధదారులు గగ్గోలు పెడుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ బాగోతంపై ‘సాక్షి’ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది. హౌజింగ్‌ సొసైటీల్లో అక్రమాలు, అవకతవకలు, బాధితుల పరిస్థితిపై ఆరా తీసింది. ముఖ్యంగా ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీల్లో ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించింది. దీనికి సంబంధించి ‘సాక్షి’ప్రత్యేక కథనం.. -బొల్లోజు రవి

►టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీని తన చేతుల్లో పెట్టుకున్న ఒక కీలక వ్యక్తి బినామీ పేర్లతో కొన్ని ప్లాట్లను తన వద్ద పెట్టుకున్నారు. ఫేజ్‌–1లో కొందరి నుంచి రూ.లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇక ఫేజ్‌–2లో కొందరు లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించినా రిజి్రస్టేషన్‌ చేయలేదు. వేరే వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకొని వారికి రిజి్రస్టేషన్‌ చేశారు. దీనిపై విచారణకు వచ్చిన అధికారుల్లో కొందరికి ప్లాట్లు రాసిచ్చి నోరు మూయించారు. 
►హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వెంకటేశ్వర కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో మాజీ అధ్యక్షుడు ఒకరు 7ప్లాట్లను తన బినామీల పేరిట రిజి్రస్టేషన్‌ చేసుకున్నాడు. అలాగే సొసైటీ పక్కనున్న హెచ్‌ఎండీఏ భూమినీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని తేలింది. ఈ స్థలాల విలువ రూ.70 కోట్లకు పైమాటే.. 

రాష్ట్రంలోని హౌసింగ్‌ సొసైటీల్లో జరుగుతున్న అక్రమాల్లో ఈ రెండు ఘటనలు చిన్న ఉదాహరణలే. కీలక సొసైటీల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 58 హౌసింగ్‌ సొసైటీలకు ప్రభుత్వ భూములు ఇచి్చంది. మొత్తం 4,297 ఎకరాలు కేటాయించగా.. అందులో హైదరాబాద్‌లోనే 2,773 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 1,101 ఎకరాలున్నాయి. ఈ భూముల్లో దాదాపు 500 ఎకరాల మేర ఏదో ఓ రూపంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. ఈ అక్రమాల విలువ దాదాపు రూ.3 వేల కోట్లని అంచనా.

1960 నుంచీ ఈ హౌసింగ్‌ సొసైటీల దందా కొనసాగుతూనే ఉందని ఆయా వర్గాల వారు చెప్తున్నారు. సహజంగా సహకార శాఖ, జీఏడీ, రెవెన్యూ శాఖలతో కూడిన కమిటీ లబి్ధదారులకు ప్లాట్లను కేటాయించాలి. కానీ సొసైటీల్లోని కీలక వ్యక్తులే ప్లాట్లు కేటాయించుకోవడం, అమ్మేసుకోవడం జరుగుతోంది. లబి్ధదారులు కోర్టులకు వెళితే.. స్టేలు తెచ్చుకొని మరీ భూదందాను కొనసాగిస్తున్నారు. విచారణకు వచ్చే అధికారులకు అదే సొసైటీల్లో ప్లాట్లను ఎరగా వేసి నోరు మూయిస్తున్నారు. దందాలకు పాల్పడుతున్న కొందరు రాజకీయాల్లో చేరి కీలక పదవులు పొందారు. 

భారీ భూదందా.. టీఎన్‌జీవో సొసైటీదే!
‘తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ’.. అసలు దరఖాస్తు చేసుకోని వారికీ ఇళ్ల స్థలాల కేటాయింపులు, సీనియారిటీని పక్కనపెట్టడం, రికార్డుల్లో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు, వసూలు చేసిన డబ్బుకు రసీదులు ఇవ్వకపోవడం.. ఒకటారెండా ఎన్నో అక్రమాలు. ప్రభుత్వ విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి. రాజకీయ ప్రమేయం, పలుకుబడి కలిగిన వ్యక్తులే దీనికి సూత్రధారులన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అన్ని హౌసింగ్‌ సొసైటీలకన్నా భారీగా అక్రమాలు జరిగిన సొసైటీ ఇదేనని ఉద్యోగ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం గజం రూ.50 వేలకుపైనే పలుకుతుండటం గమనార్హం. 

విచారణలో  బయటపడ్డా.. 
రాష్ట్ర ప్రభుత్వం ఈ సొసైటీకి గచ్చిబౌలీలో 158 ఎకరాలు కేటాయించింది. 1,937 మంది సభ్యులున్నారు. అసలు లేఔట్‌ లేకుండానే సొసైటీ స్థలాన్ని ప్లాట్లుగా విభజించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా డెవలప్‌మెంట్‌ చార్జీలను వసూలు చేశారు. రూ.లక్ష, నుంచి రూ.3.50 లక్షల చొప్పున తీసుకున్నారు. దీనికి రశీదులు ఇవ్వలేదు. సీనియారిటీ ప్రాతిపదికన కేటా యించాల్సి ఉండగా.. జంబ్లింగ్‌ పద్ధతిలో ఇచ్చారు. ఇతర జిల్లాల్లోని టీఎన్జీవోలకూ స్థలాలిచ్చారు. అర్హత కలిగిన ఉద్యోగుల జాబితాను సాధారణ పరిపాలనా శాఖ ఉప కార్యదర్శి నుంచి తీసుకోవాల్సి ఉన్నా సొసైటీ అలా వ్యవహరించలేదు. ఇది అక్రమాలకు మరింతగా అవకాశమిచ్చింది. కొందరు మెంబర్లు తప్పుడు అఫిడవిట్లతో స్థలాలు పొందారు. వీటిని పరిశీలించడంలో సొసైటీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 
►సొసైటీలో 2,102 ప్లాట్లకుగాను 1,986 ప్లాట్లను మాత్రమే కేటాయించారు. ఇందులో 124 మందికి సంబంధించిన దరఖాస్తులే లేవు. 166 ప్లాట్లకు వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా లేదు. 
►కొందరు సొసైటీ పెద్దలు కొత్త సభ్యులను చేర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా బినామీ పేర్లతో కాజేశారు. తమకు తెలిసిన వారికి అమ్మేసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభ్యుల చేరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. 
►సొసైటీలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే అలా విచారణకు వచి్చన అధికారులకు కూడా పప్పుబెల్లాల్లా సొసైటీలో స్థలాలు కట్టబెట్టారు. ఒక కీలక అధికారికి ఉచితంగా 10 ప్లాట్లు ఇచ్చారని సమాచారం. 
►ప్రభుత్వం కేటాయించిన స్థలానికి మించి.. పక్కనే ఖాళీగా ఉన్న మరో 8.34 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లు వేసి అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. 

లబ్ధిదారులకు తెలియకుండా.. 
మైలార్‌దేవ్‌పల్లిలో 1960లో ఏర్పాటైన ఎన్జీవోస్‌ ఎంప్లాయీస్‌ సొసైటీకి ప్రభుత్వం అప్పట్లో వంద ఎకరాలను కేటాయించింది. అప్పటి సొసైటీ పెద్దలు కొందరు ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించినా వారికి చెప్పకుండా దాచిపెట్టారు. కొన్నేళ్లు అలాగే ఉంచేసిన సొసైటీ పెద్దలు, కొందరు స్థానికులతో కలిసి బినామీ పేర్లతో అమ్మేసుకున్నారు. ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ విషయం తెలిసిన సదరు లబ్ధిదారుల వారసులు కొందరు.. ప్రస్తుతం ఆ ప్లాట్ల కోసం పోరాటం చేస్తున్నట్టు తెలిసింది.  

సినీ కార్మీకుల స్థలాలు.. దర్జాగా కబ్జా
అది హైదరాబాద్‌ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఉన్న చిత్రపురి కాలనీ.. సినీ కార్మికుల కోసం ఏర్పాటైన హౌజింగ్‌ సొసైటీ. అంటే.. పేద సినీ కళాకారులు, కారి్మకులకు ఇండ్లు, స్థలాలు ఉంటాయని అనుకుంటాం. కానీ అక్కడి ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో చాలా వరకు కబ్జాదారుల చేతిలో చిక్కుకున్నాయి. సినీ రంగంతో ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తులు, ఎన్నారైలు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, రాజకీయ నాయకులు, మీడియా రంగానికి చెందిన కొందరు సినీ కళాకారుల ముసుగులో, బినామీ పేర్లతో వాటిల్లో తిష్ట వేశారు. చిత్రపురి కాలనీ సొసైటీ నేతలే స్వయంగా సాగించిన ఈ బినామీ దందాలో వందల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సినీ కారి్మకులు అప్పట్లో రూ.1.10 కోట్లు వెచ్చించి కొన్న ఈ స్థలం విలువ ఇప్పుడు రూ.3 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా. 

ఎవరికి దక్కాలి.. ఏమయ్యాయి..? 
సినిమా రంగానికి చెందిన కళాకారులు, కారి్మకుల కోసం 1994లో రాష్ట్ర ప్రభుత్వం మణికొండ జాగీర్‌ సర్వే నంబర్‌ 246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సినీ కారి్మకులు అప్పట్లో ఏపీ సినీ వర్కర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకుని.. ఈ భూమిని గజానికి రూ.40 చొప్పున రూ.1.10 కోట్లు చెల్లించి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సినీ కళాకారులకు 50 శాతం, అప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్లకు 50 శాతం చొప్పున ఫ్లాట్లు, ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత 4,213 మంది సభ్యులే ఉన్న ఈ సొసైటీలో.. ఏకంగా 9,250 మంది నకిలీలకు సభ్యత్వం కట్టబెట్టారు. అర్హులైన కారి్మకులు, కళాకారులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను బినామీలకు అమ్ముకున్నారు. 

సీబీసీఐడీ విచారణ జరగాలి 
హైదరాబాద్‌లో జరిగిన అతిపెద్ద భూకుంభకోణం ఇది. చిత్రపురి సొసైటీలో వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరిగింది. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలి. – కస్తూరి శ్రీనివాస్, అధ్యక్షులు, చిత్రపురి సాధన సమితి 

దారుణంగా మోసపోయాను 
డబ్బులు కట్టించుకొని మోసం చేశారు. నాకు కేటాయించిన ఫ్లాట్‌ను బయటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు. అదేమని అడిగితే బెదిరిస్తున్నారు. నేను రూ.16 లక్షలు చెల్లించాను. నాలాగా ఎందరో మోసపోయారు. – వనజ, జూనియర్‌ ఆర్టిస్టు 

డబ్బు కట్టినా ఫ్లాట్‌ ఇవ్వలే..
30 ఏళ్ల కిందటే సొసైటీ సభ్యత్వం తీసుకున్నాను. ప్రతి వాయిదా కచి్చతంగా చెల్లించాను. కొద్దిరోజుల్లో గృహ ప్రవేశం చేస్తాననుకున్నాను. కానీ చివరికి నాకు ఫ్లాట్‌ లేదన్నారు. ముప్పై ఏళ్ల సీనియారిటీని కూడా లెక్క చేయలేదు. – సూరత్‌ రాంబాబు, కో డైరెక్టర్‌ 

హైదరాబాద్‌ ఉద్యోగుల సొసైటీ.. అక్రమాల అడ్డా 
అది రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలోని చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసుకున్న ‘హైదరాబాద్‌ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌజింగ్‌ సొసైటీ’.. నిబంధనల ప్రకారం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకే ఇంటి స్థలాలు కేటాయించాలి. కానీ అర్హులను పక్కనపడేసి అక్రమాలకు దారులు తెరిచారు. డబ్బులు ముట్టజెప్పినవారికి, తాము చెప్పినట్టు వినే ఉద్యోగులకు స్థలాలు ఇచ్చారు. కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఉద్యోగ సంఘాల నేతలు, కొందరు ప్రభుత్వ పెద్దలకూ ఇందులో స్థలాలు కేటాయించారు. సొసైటీలో అక్రమాలపై ఫిర్యాదులు వస్తే.. వాటి నిగ్గు తేల్చేందుకు విచారణకు వచ్చిన అధికారులకు కూడా ఇందులో స్థలాలను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. మరోవైపు అర్హత ఉన్న చిన్న స్థాయి ఉద్యోగులు మాత్రం తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని వాపోతున్నారు. 

అంతా పెద్దల ఇష్టారాజ్యం 
ప్రభుత్వం 2003లో మణికొండ జాగీర్‌ పరిధిలోని సర్వే నంబర్లు 203/పీ, 204, 205, 208, 209లలో 50 ఎకరాల భూమిని ‘హైదరాబాద్‌ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ’కి కేటాయించింది. ఈ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు మొదటి నుంచీ వివాదాస్పదంగానే మారింది. పాలక కమిటీ సొసైటీ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యవహరించింది. ఉద్యోగుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకపోవడం, స్థలం కేటాయింపు జరిగిన ఉద్యోగి ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే.. వారి కేటాయింపును రద్దుచేసి వేరేవారికి స్థలాలు ఇవ్వడం, తమ కనుసన్నల్లో పనిచేసిన వారికి, డబ్బులు ముట్టజెప్పినవారికి ప్లాట్లు ఇచ్చుకోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. సభ్యుల నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలు చేయడం ద్వారా రూ.20 కోట్ల మేర అనధికారికంగా రాబట్టినట్టు ఉద్యోగ వర్గాలే చెప్తున్నాయి. ఈ భూబాగోతం వెనుక పెద్దల హస్తం ఉందని విచారణలో తేలినా చర్యలు శూన్యం. 

సొసైటీ నియమావళినే మార్చేసి.. 
►హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే ఈ సొసైటీలో ప్లాట్లు పొందేందుకు అర్హులు. కానీ నిబంధనలు, సొసైటీ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఫ్లాట్లు కట్టబెట్టుకున్నారు. అసలు ఈ హౌసింగ్‌ సొసైటీ ఆవిర్భావ స్ఫూర్తి అయిన ‘ఎన్జీఓలకు ఇళ్లస్థలాల కేటాయింపు’అంశాన్నే పక్కదోవపట్టిస్తూ 2008 నవంబర్‌ 8న సొసైటీ నియమావళిని మార్చేశారు. 
►సొసైటీకి ప్రభుత్వం 2003లో 50 ఎకరాలను కేటాయించగా.. అప్పటినుంచి ఆరేళ్ల పాటు సభ్యులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. హెచ్‌ఎండీఏ జారీ చేసిన లేఔట్‌కు విరుద్ధంగా.. 22 ప్లాట్లను (బై నంబర్‌ వేసి) అదనంగా సృష్టించారు. ఒక స్థలాన్ని ఇద్దరికి కేటాయించడం 23 మంది సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. 
►ఇక 81 మంది అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు సహకార శాఖ గతంలోనే తేలి్చంది. ఇందులో ఏసీబీ, పోలీసు విభాగాలకు చెందిన 22 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం. 
►సొసైటీ అక్రమాల నిగ్గుతేల్చేందుకు ని యమించిన అధికారులకు ప్లాట్లు ఇవ్వ డం, అనుమతుల్లేకుండా ఇళ్లు కట్టుకునేందుకు చాన్సిచ్చిన పంచాయతీ కార్యదర్శికి స్థలం కేటాయించడం గమనార్హం. 

ఖమ్మం టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు
‘ది ఖమ్మం డి్రస్టిక్ట్‌ టీఎన్జీవోస్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ’పై పలు ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా చేరిన 215 మందికి ప్లాట్లు కేటాయించడాన్ని సభ్యులు అభ్యంతర పెట్టారు. వెలుగుమట్లలో సొసైటీకి సంబంధించిన స్థలం ఉండగా, ఇందులో ఖాళీ స్థలాలు కొన్ని లీజుకు ఇస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నా రు. హౌజింగ్‌ సొసైటీకి ప్రభుత్వం 2005 ఏడాదిలో 103.26 ఎకరాలను కేటాయించింది. సొసైటీలో 3,772 మంది సభ్యులున్నారు. వీరిలో 1905 మందికి స్థలాలు కేటాయించారు. 1901 మందికి పూర్తిగా ఇవ్వగా, నలుగురు వివిధ కారణాలతో వీటిని తీసుకోలేదు. సొసైటీలో సభ్యులు తమ స్థలాలు అమ్ముకోలేదు. అయితే 39 మంది వరకు తమకు కేటాయించిన స్థలాలను పరస్పరం అంగీకారం మేరకు మా ర్చుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. ఈ అంశాలపై విచారణకు ఫోర్‌మెన్‌ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4.26 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఇందులో దేవాలయాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. హౌజింగ్‌ సొసైటీలో రాజకీయ ప్రమేయంతోనే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి.  

సొసైటీపై నేతల ఒత్తిళ్లు పెరిగాయి 
హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో ప్లాట్ల కేటాయింపు, నిర్మాణాలు అన్నీ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశాం. సొసైటీ భూమి ఎక్కడా ఆక్రమణలకు గురి కాలేదు. భూమి హద్దులు కొలిచి ఆక్రమించినట్లు తేలితే ప్రభుత్వం తీసేసుకోవచ్చని, లేనిపక్షంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఉద్యోగులకు కేటాయించాలని ఇప్పటికే కోరాం. హౌజ్‌ బిల్డింగ్‌ సొసైటీపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు బాగా పెరిగాయి. దీనివల్ల అనేకమంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు. – ఏలూరి శ్రీనివాసరావు, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అధ్యక్షుడు, ఖమ్మం 

ప్రభుత్వం భూములు ఎందుకు ఇస్తుంది? 
ఉద్యోగులు, కళాకారులు, ఇతర రంగాల వారు సొంత ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం పొందవచ్చు. వారు హౌజింగ్‌ సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. అందులో ప్లాట్లుగా వ్యక్తిగత ఇళ్ల కోసంగానీ, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లుగా ఇళ్లు కట్టుకోవడానికి ప్రతిపాదనలను అందజేయాలి. సభ్యుల్లో ఎవరెవరికి, ఎలా కేటాయిస్తారో తెలపాలి. తర్వాత ప్రభు త్వం సొసైటీల దరఖాస్తులను పరిశీలిస్తుంది. ఆయా రంగాల ప్రాధాన్యత, సమాజానికి వారి నుంచి అందు తున్న సేవలను ఆధారంగా చేసుకుని.. నామమాత్రపు ధరకే భూములను కేటాయిస్తుంది. సదరు సొసైటీలు ఆ భూములను ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లుగా అభివృద్ధి చేసుకుని సభ్యులకు పంపిణీ చేసుకోవాలి. ఈ విధంగా ఆయా రంగాల వారికి అతి తక్కువ ధరలోనే సొంత ఇల్లు సమకూరే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు భూములు కేటాయిస్తూ ఉంటాయి.   

మరిన్ని వార్తలు