‘డబుల్‌’తో సంబంధం లేదు

16 Aug, 2022 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జీహెచ్‌ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం అందిన 7.09 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని, కులం, మతం, వయసు, ఓటరు గుర్తింపు కార్డు వివరాల సేకరణ మాత్రమే జీహెచ్‌ఎంసీ చేపట్టిందని ఆమె తెలిపారు. ఆయా వివరాలను సేకరించి పూర్తి సమాచారంతో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు.   కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మేయర్‌ ప్రసంగంలో ప్రధాన అంశాలివీ.. 

  • మురికి వాడల్లోని పేద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌లో ఏడాదికి 600 మందికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.  
  • నగరంలోని అన్ని  కాలనీల్లో నూరు శాతం పచ్చదనం లక్ష్యం సాధించేందుకు, దాని ద్వారా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల్లోని మహిళలకు ఆదాయం లభించేందుకు తొలిదశలో 3 వేల కాలనీల్లో మొక్కల పెంపకం బాధ్యతల్ని అప్పగించాం. 
  • ప్రజల రక్షణ కోసం 1456 మురికివాడలు,  975 పార్కుల్లో రూ. 20 కోట్లతో దాదాపు 8వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, సహాయ పరికరాలను 4,749 మందికి త్వరలో పంపిణీ చేస్తాం. 
  • నగరంలోని 185 చెరువుల్ని దశలవారీగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాం.  
  • భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్లు ప్రస్తుతమున్న రెండింటికి  తోడు మరో రెండు చారి్మనార్, సికింద్రాబాద్‌ల వైపు ఏర్పాటు కానున్నాయి. ఎస్సార్‌డీపీ  ద్వారా 16 ఫ్లైఓవర్లు, 5 అండర్‌ పాస్‌లు,  6 ఆరోఓబీలు, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మరో 18 çపనులు పురోగతిలో ఉన్నాయి. వాటిలో వీలైనన్ని పనుల్ని డిసెంబర్‌లోగా పూర్తిచేస్తాం.  
  • రహదారుల నిర్వహణలో భాగంగా రూ.409 కోట్లతో  1,740  పనులు పూర్తయ్యాయి. సీఆర్‌ఎంపీ ద్వారా  ఇప్పటి వరకు 678.41 కి.మీ రోడ్ల రీకార్పెటింగ్‌కు రూ.783.16 ఖర్చయింది.  
  • రెండు దశల్లో రూ. 49.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 34 ఆధునిక వైకుంఠ ధామాల్లో  28 పూర్తయ్యాయి.  

(చదవండి: కంటోన్మెంట్‌ విలీనంపై.. తేలేదెప్పుడు?)

మరిన్ని వార్తలు