'అశ్వత్థామరెడ్డి మమ్మల్ని బెదిరించలేదు'

29 Sep, 2020 17:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్‌ రెడ్డి సోమవారం నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. తాజాగా థామస్‌రెడ్డి వ్యవహారతీరుపై మండిపడుతూ టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డే కొనసాగనున్నట్లు ఆర్టీసీ కేంద్ర కమిటీ మరోసారి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. (చదవండి : రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక సంఘం)

' రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామ రెడ్డి కొనసాగాలని (ఆదివారం 27) రోజున కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తిర్మానించడం జరిగింది. ఈ కేంద్ర కమిటీ కి గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షుడు.బి. వెంకటేష్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పి.రెడ్డి, హైదరాబాద్ రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, ఎస్.యచ్.కె.రెడ్డి, సికింద్రాబాద్ రీజినల్ కార్యదర్శి నర్సింహులు హాజరై అశ్వత్థామ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. కాని నిన్న థామస్ రెడ్డి పదవి కాంక్షతో అశ్వత్థామరెడ్డిపై చేసిన తప్పుడు ఆరోపణలను గ్రేటర్ హైదరాబాద్ జోనల్, రీజినల్ నాయకులుగా తాము ముక్త కంఠంతో ఖండిస్తూన్నాం. థామస్ రెడ్డి ఆరోపించినట్టుగా అశ్వత్థామరెడ్డి మమ్మల్ని ఎవరిని బెదిరించలేదు. మేము అతని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.'అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
(చదవండి : అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది)

మరిన్ని వార్తలు