మెదక్‌ చర్చి బిషప్‌పై సస్పెన్షన్‌ వేటు 

30 Nov, 2022 08:59 IST|Sakshi

సాక్షి, మెదక్‌: సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రెవ ఎ.సి.సాల్మన్‌రాజ్‌ను సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ఐ చెన్నై సినాడ్‌ మాడరేటర్‌ ధర్మరాజు రసాలం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మెదక్‌ బిషప్‌ ఎ.సి.సాల్మన్‌రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, సీఎస్‌ఐ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘించారని సినాడ్‌కు ఫిర్యాదులు అందాయి. మెదక్‌ చర్చి పాస్టరేట్‌ కమిటీ పాలకవర్గ నియామకం విషయంలో మెజారిటీ సభ్యుల ప్యానెల్‌కు కాకుండా బిషప్‌ తన వర్గానికి పదవులు దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి.

దీనిపై పాస్టరేట్‌ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు నిరసన తెలుపుతూ బిషప్‌పై చెన్నై సినాడ్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సినాడ్‌ కోర్టు ఎ.సి.సాల్మన్‌రాజ్‌ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిపాలన విషయాల్లో సీఎస్‌ఐ బైలాను పాటించలేదని నిర్ధారిస్తూ మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ పదవి నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆయన స్థానంలో డోర్నకల్‌ మోడరేటర్‌ బిషప్‌ పద్మారావును మెదక్‌ డయాసిస్‌ ఇన్‌చార్జ్‌ బిషప్‌గా నియమిస్తున్నట్లు సీఎస్‌ఐ మాడరేటర్‌ ధర్మరాజ్‌ రసాలం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్‌లో సీఎస్‌ఐ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు. 
చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య

మరిన్ని వార్తలు