నెలాఖరుకు 90 లక్షల టీకాలు 

4 Oct, 2021 01:09 IST|Sakshi

ఆ మేరకు డోసులు పంపాలని కేంద్రానికి విన్నపం 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెలాఖరుకు 90 లక్షల కరోనా టీకాలను లబ్ధిదారులకు అందజేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన డోసులను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు నెలకు కేంద్రప్రభుత్వం నుంచి 65 లక్షల డోసులు రానుండగా.. మిగిలిన డోసులను కూడా అదనంగా ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

ఈ ఒక్క నెలలోనే 90 లక్షల టీకాలు ఇవ్వగలిగితే, దాదాపుగా 80 శాతం మేరకు మొదటి డోస్‌ను టీకా ఇచ్చినట్లు అవుతుందని, ఆ తర్వాత పూర్తిగా రెండోడోస్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన టీకా లబ్ధిదారులు 2.80 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటివరకు 1.88 కోట్లు మొదటి డోస్, 71.32 లక్షల రెండోడోస్‌ వేశారు. డిసెంబర్‌ నాటికి అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలు అందజేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు