ఆక్సిజన్‌ ప్లాంట్లలో సిలిండర్లు నింపుకొనే వెసులుబాటు

4 Jun, 2022 04:04 IST|Sakshi
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ 

చిన్న ఆసుపత్రులకు సరఫరా చేసేలా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా ఆసుపత్రుల్లోని పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద సిలిండర్లను నింపి ఏరియా, సామాజిక, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాలని వైద్యవిధాన పరిషత్‌ నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద ఆక్సిజన్‌ భారీగా అందుబాటులో ఉందని, దాన్ని చిన్న ఆసుపత్రులకు సరఫరా చేస్తే రోగులకు ఉపయోగం ఉంటుందని పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు.

సిలిండర్లను నింపుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, ఫార్మసిస్టులు, ఇతర అధికారులతో డాక్టర్‌ అజయ్‌కుమార్‌ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్లను ప్రోత్సహించవద్దని సూచించారు.

ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను విస్త్రృత పరచాలని, అవసరం లేకపోయినా పైస్థాయి ఆసుపత్రులకు రోగులను రిఫర్‌ చేయకూడదని పేర్కొన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులు బయట కొనుగోలు చేసే పరిస్థితి రావొద్దని, డయాలసిస్‌ యూనిట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని వైద్య విద్యాసంచాల కుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

మరిన్ని వార్తలు