వైద్య పోస్టుల భర్తీ మెడికల్‌ బోర్డుకే! 

14 Jun, 2022 02:18 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం   

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య, వైద్య సహాయక పోస్టుల భర్తీ ప్రక్రియనంతా ఒక నియామక సంస్థకే అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 2,662 ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక ఏజెన్సీగా టీఎస్‌పీఎస్సీని ఎంపిక చేసిన ప్రభుత్వం... మరో 10,028 పోస్టుల భర్తీ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యసేవల నియామకాల బోర్డుకు అప్పగించింది.

అయితే రెండు నియామక సంస్థలకు అప్పగించిన ఉద్యోగాల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, స్టాఫ్‌ నర్సు పోస్టులు ఒకే కేడర్‌కు చెందినవిగా ఉన్నాయి. ఈ పోస్టులను రెండు ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తే సమయం వృథా, నిర్వహణ భారం కావడంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. 

ప్రతిపాదనలు పంపండి
రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన నియామకాలపై వెద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ ఇటీవల సమావేశమైంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, జోన్లు, జిల్లాలవారీగా ఖాళీల ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. 

మరిన్ని వార్తలు