ప్రీతి ఫోన్‌ కాల్‌ ఆడియో వెలుగులోకి.. తల్లితో ఏం చెప్పింది?

26 Feb, 2023 11:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. కాగా, సైఫ్‌ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్‌ కాల్‌ ఆడియో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్‌ చేసి తన బాధను ఫోన్‌కాల్‌లో చెప్పుకుంది.

‘‘సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటే. నాన్న పోలీసులతో ఫోన్‌ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్‌ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’’ అంటూ తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై నన్ను దూరం పెడతారని, ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడి నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రీతి ఆవేదన చెందగా, సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి చెప్పింది.

కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్‌ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్‌ కాలేజీ, ఎంజీఎం హెచ్‌ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్‌ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్‌ టార్గెట్‌ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.
చదవండి: నవీన్‌ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్‌ కాల్‌ వైరల్‌

మరిన్ని వార్తలు