ప్రయాణికులకు పలు ఆఫర్లు
టికెట్లపై 40 శాతం తగ్గింపు
గరిష్టంగా 40 ట్రిప్పులకు డబ్బు చెల్లించి.. 60 ట్రిప్పులు తిరిగే చాన్స్
అక్టోబర్ 17– 31 వరకు ఆఫర్
నవంబర్ 1 నుంచి 50 శాతం క్యాష్బ్యాక్
సాక్షి, హైదరాబాద్/రసూల్పురా: గ్రేటర్ వాసులను మెట్రో జర్నీ వైపు ఆకర్షించేందుకు మెట్రో రైలు సంస్థ పలు రాయితీలు కల్పించింది. దసరా సందర్భంగా ‘మెట్రో సువర్ణ’ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ఈనెల 17 నుంచి 31 వరకు ప్రయాణికులకు టికెట్ చార్జీల్లో 40 శాతం రాయితీ లభించనుంది. అంటే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణానికి రూ.60 గరిష్ట చార్జీ ఉండగా... 40 శాతం రాయితీ పోను రూ.36 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్లలో భాగంగా గరిష్టంగా 40 ట్రిప్పులకు చార్జీ చెల్లించి 60 ట్రిప్పులు జర్నీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ రాయితీల వివరాలను శుక్రవారం సాయంత్రం రసూల్పురాలోని మెట్రోరైలు కార్యాలయంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డిలు సంయుక్తంగా ప్రకటించారు. కాగా లాక్డౌన్కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం.. మొత్తం మూడు రూట్లలో నిత్యం 3.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసేవారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ రోజుకు 90 వేలకు తగ్గింది. ఇటీవలి వర్షాలకు నగరంలో భారీగా రహదారులు దెబ్బతినడం, తమ ఆఫర్ల కారణంగా మెట్రో తిరిగి పూర్వపు స్థాయిలో ప్రయాణికులతో కళకళలాడుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.
స్మార్ట్కార్డ్కు ఆఫర్ ఇలా...
► ఈ ఆఫర్ ప్రకారం కేవలం 14 ట్రిప్పులకు డబ్బు చెల్లించి 20 ట్రిప్పులు జర్నీ చేయవచ్చు. స్మార్ట్కార్డు రీఛార్జీ చేసిన దగ్గరి నుంచి 30 రోజుల వరకు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. అంటే ఎల్బీనగర్ నుంచి మియాపూర్కు నిత్యం జర్నీ చేసే ప్రయాణికుడు కేవలం 14 ట్రిప్పులకు.. అంటే రూ.840 చెల్లించి 20 ట్రిప్పుల జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అంటే అతనికి రూ. 360 ఆదా కానుంది.
► ఇక 20 ట్రిప్పులకుగాను స్మార్ట్కార్డులో రీఛార్జీ చేసుకుంటే 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చు. రీఛార్జీ చేసిన దగ్గరి నుంచి 45 రోజులపాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
► ఇక గరిష్టంగా 40 ట్రిప్పులకు డబ్బులు చెల్లిస్తే... 60 ట్రిప్పులు జర్నీ చేయవచ్చు. ఈ ఆఫర్ రీచార్జీ చేసిన దగ్గరి నుంచి 60 రోజులపాటు అమల్లో ఉంటుంది.
► ఈ మెట్రో సువర్ణ ఆఫర్ ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఆలోగా రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబరు ఒకటి నుంచి క్యాష్బ్యాక్
మీ స్మార్ట్కార్డును ఆన్లైన్ ద్వారా రూ.400– 1800 వరకు రీఛార్జీ చేసుకుంటే 50 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. అంటే రూ.400 చెల్లించి రీఛార్జీ చేసుకుంటే మీ కార్డుకు రూ.600 జమ అవుతాయి. ఈ ఆఫర్ నవంబరు ఒకటిన ప్రారంభమై జనవరి 15 వరకు అందుబాటులో ఉంటుంది.