ఎలుకలు పట్టాలా.. వైద్యం చేయాలా 

6 Apr, 2022 01:50 IST|Sakshi

ఎలుకల బోన్లతో ఎంజీఎం వైద్యుల ఆందోళన 

ఎంజీఎం: ‘ఎలుకలు పట్టమంటారా.. లేకపోతే రోగులకు చికిత్స చేయమంటారా. మేమే పనిచేయాలో చెప్పండి’.. అంటూ ఎంజీఎం వైద్యులు ఎలుకల బోన్లను పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో వైద్యులపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజీడీఏ) ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన బాట పట్టారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ప్రదర్శించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో నిజమైన బాధ్యులను వదిలేసి వైద్యులను అభద్రతాభావానికి గురిచేసేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైద్యులపై చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీడీఏ అధ్యక్షుడు రాజ్‌మోహన్, కార్యదర్శి హరిదేవ్, వైద్యులు పవన్, చంద్రబాను, అన్వర్‌మియా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు