8 నిమిషాల్లో.. 8 కిలో మీటర్లు.. మూడు ప్రాణాలు

14 May, 2022 12:19 IST|Sakshi

సాక్షి,రసూల్‌పురా(హైదరాబాద్‌): మిలటరీ అధికారులు, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి అవయవాలను సకాలంలో చేర్చి ముగ్గురికి ప్రాణదానం చేశారు. ఆర్మీ అధికారులు, తిరుమలగిరి ట్రాఫిక్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. కాశ్మీర్‌ లోయలో పనిచేస్తున్న సైనికుడు ఎన్‌కేజే. హరిబాబు తల్లి బ్రెయిన్‌ హెమరేజ్‌తో తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఆమే తన అవయవాలను దానం చేసేందుకు అంగీకరించడంతో తిరుమలగిరి మిలటరీ ఆస్పత్రి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వరకు 8 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో చేరేందుకు ట్రాఫిక్‌ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి, తెలంగాణ ఆంధ్రసబ్‌ ఏరియా కల్నల్‌ విశాల్‌ ఆనంద్‌ సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు. అవయవాలను వేగంగా తరలించేందుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయడంతో అంబులెన్స్‌ వాహనం 8 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌ చేరింది. అక్కడి నుంచి విమానంలో కిడ్నీలు వెళ్లగా మరో అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి ఊపిరితిత్తులు తీసుకెళ్లారు. ఈ అవయవాలను ముగ్గురు ఆర్మీ అధికారులు మేజర్‌ జనరల్‌ అరుణ్, మేజర్‌ జనరల్‌ ఆర్‌ఎస్, మన్రల్, కర్మాకర్‌లకు అమర్చనున్నారు. సకాలంలో అవయవాలు చేరేందుకు సహకరించిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ శశికళ, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎఝూ, లెఫ్టినెంట్‌ కల్నల్‌ నితేష్, ఉస్మానియా, కిమ్స్‌ ఆస్పత్రుల వైద్యులు ఈ గ్రీన్‌ కారిడర్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.  

చదవండి: అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా!

మరిన్ని వార్తలు