కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త

5 Feb, 2022 16:26 IST|Sakshi

కువైట్‌లో కనీస వేతనం 100 దినార్‌లు!

వలస కార్మికుల వేతనంపై విదేశాంగశాఖ ప్రతిపాదన

మోర్తాడ్‌ (బాల్కొండ): కువైట్‌కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త. ఆ దేశంలో పని చేసే భారత కార్మికులకు కనీస వేతనంగా నెలకు వంద దినార్‌లు అంటే మన కరెన్సీలో రూ.24,700 ఇవ్వాలని భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రతిపాదించారు. కువైట్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మ్యాన్‌పవర్‌ (పీఏఎం)కు అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. కువైట్‌లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన ఆంశంపై అక్కడి ప్రభుత్వం వివిధ దేశాల కార్మిక శాఖలతో చర్చలు జరిపింది. 

ప్రధానంగా భారత్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌ల కార్మిక శాఖలతో కువైట్‌ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఈ మేరకు భారత వలస కార్మికులకు కనీస వేతనంగా రూ.24,700 చెల్లించాలనే ప్రతిపాదన సిద్ధమైంది. గతంలో కనీస వేతనంగా నెలకు 45 దినార్లు చెల్లించాలని విదేశాంగ శాఖ అధికారులు చెప్పడంతో కార్మికులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా కరోనా కష్టాల సమయంలో కువైట్‌.. వలస కార్మికులకు కనీస వేతనం పెంచే విషయంపై ఆలోచన చేయడం హర్షణీయమని కార్మికులు అంటున్నారు.  (క్లిక్‌: ఎంబసీ బాత్‌రూమ్‌లో స్పై కెమెరాల కలకలం)

60 ఏళ్లు నిండిన కార్మికులకు ఊరట.. 
60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపాలన్న నిర్ణయంపై కువైట్‌ వెనక్కు తగ్గింది.  డిగ్రీ అర్హత లేదా 60 ఏళ్లు దాటినవారి వీసాలు, వర్క్‌పర్మిట్‌లను కొంతకాలం రెన్యూవల్‌ చేయలేదు. దీంతో నిపుణులైన కార్మికులు డిగ్రీ పట్టా లేక ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే నైపుణ్యం ఉన్న కార్మికులకు కొరత ఏర్పడడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డిగ్రీ పట్టా లేనివారి నుంచి 250 దినార్‌లను ఫీజుగా వసూలు చేసి వర్క్‌పర్మిట్లను రెన్యూవల్‌ చేస్తోంది. (క్లిక్‌: అరుదైన గౌరవం అందుకున్న కాజల్‌ అగర్వాల్‌)  

>
మరిన్ని వార్తలు