టిమ్స్‌ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి ఈటల

2 Aug, 2020 13:30 IST|Sakshi

కరోనా వైద్య సేవలపై మంత్రి ఆరా..

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఫార్మసీ, డైనింగ్‌ రూమ్‌, క్వాంటీన్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్నారని తెలిపారు. టిమ్స్‌ను పూర్తిస్థాయిలో కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చామని తెలిపారు. ఆసుపత్రిలో 1350 పడకలు, ల్యాబ్‌లు, ఐసీయూ అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్‌, మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి రాజేందర్‌ తెలిపారు

కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వంద శాతం కరోనా బారి నుంచి బయట పడతామన్నారు. లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌ ద్వారా అధిక మంది బాధపడుతున్నారని, ఆక్సిజన్‌ అందించిన కూడా కొందరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. కరోనా వైద్యం ఖరీదైనది కాదని, పదివేల లోపే ఖర్చువుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల ఫీజులపై సమీక్ష నిర్వహించామని, సామాన్యులను పీక్కుతినే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైద్య కేంద్రాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో కింగ్‌ కోఠి, చెస్ట్‌, సరోజిని,టిమ్స్‌, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయని వెల్లడించారు. కరోనా ఆసుపత్రుల్లో సరిపోయే బెడ్స్‌ ఉన్నాయని, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని మంత్రి సూచించారు. టిమ్స్‌లో కొందరు కరోనా బాధితులతో మాట్లాడానని, వైద్యం బాగుందని చెబుతున్నారని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ వారం రోజుల్లో పెట్టిస్తామన్నారు. ఫీవర్, చెస్ట్, ఉస్మానియా, సరోజిని, కింగ్‌కోఠి, వరంగల్ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ పెడుతున్నామని మంత్రి రాజేందర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు