బండి సంజ‌య్‌కు మంత్రి హ‌రీష్ స‌వాల్

21 Oct, 2020 17:33 IST|Sakshi

సిద్దిపేట : దుబ్బాకలో టిఆర్ఎస్‌కు  మద్దతుగా మహిళలతో సంఘీబావ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్ డిపో నుంచి అంబేద్క‌ర్ సర్కిల్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మంగళ హరతులు, డప్పు చప్పుళ్లతో మహిళలు భారీగా తరలివచ్చారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు  మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి,  స‌హా ప‌లువురు టిఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. బీడి పెన్ష‌న‌ర్ల‌కు 1600 రూపాయ‌లు ఇస్తున్నామ‌ని బీజేపీ చేస్తోందంతా ప‌చ్చి అబద్ద‌మ‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.

బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే  మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హ‌రీష్ రావు అన్నారు. ఒక‌వేళ   ఇవ్వకపోతే నువ్వు రాజీనామాకు సిద్దామా అంటూ  బండి సంజయ్‌కి  సవాల్ విసిరారు. చింతమడక ల పుట్టిదుబ్బాకలో చదువుకున్న కేసీఆర్‌కు   దుబ్బాక పైన ప్రేమ ఉంటది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని ప్ర‌శ్నించారు. సోలీపేట  సుజాతక్క గెలుపు మ‌హిళ‌లు గెలుపన్నారు.   మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయ‌ల  పెన్షన్ ఇస్తే కేసీఆర్ 2000  రూపాయ‌లు ఇస్తున్నార‌ని, బీజేపీ, కాంగ్రెస్ చేసే అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని తెలిపారు. రాష్ర్ట ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు కేంద్ర‌మే నిధులు ఇస్తోంద‌ని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంద‌ని మంత్రి హ‌రీష్ అన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్, బీడీ పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మీ స్కీము ఇస్తోందా అని ప్ర‌శ్నించారు.  'బీజేపీ ఏమి చేస్తామని ప్రచారం చేస్తారు ? విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా ? ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ మక్కలు తెస్తున్నారో బీజేపీ చెప్పాలి' అని మంత్రి హ‌రీష్ డిమాండ్ చేశారు. దుబ్బాక ప్ర‌జ‌లు  అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీల‌ను న‌మ్మితే మోస‌పోతామ‌ని తెలిపారు.  రామలింగారెడ్డి  తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారని అభ్యర్థి  సోలీపేట సుజాత అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రి లాగా నన్ను ఆశీర్వదించి మీ సేవ కోసం పంపారు. దుబ్బాక ప్రజల ఆశీస్సులతో రామలింగారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు