Indrakaran Reddy: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

10 Jun, 2021 08:27 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన తెలంగాణ డయగ్నోస్టిక్‌ హబ్‌ను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌లతో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. 19 జిల్లాల్లో డయగ్నోస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 57 రకాల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు.  రూ.2.40 కోట్లతో రిమ్స్‌ ఆవరణలో డయగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని, రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గతేడాది రూ.40వేల కోట్ల ఆదాయం నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా లాక్‌డౌన్‌ విధించడం జరిగిందన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌లు మాట్లాడారు. జిల్లాలో నాలుగు రూట్లు ఏర్పాటు చేసి 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను తెలంగాణ డయగ్నోస్టిక్‌ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుందన్నారు.

వైద్యం కంటే ప్రైవేటులో నిర్ధారణ పరీక్షలకే అధిక డబ్బులు ఖర్చవుతున్నట్లు తెలిపారు. చాలా మంది అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని, పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం నిర్ధారణ పరీక్షలు తీసుకొచ్చే వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్, రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ  సాధన, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. 

చదవండి: Telangana: ఎంసెట్‌ వాయిదా!  

మరిన్ని వార్తలు