ఆస్తుల కంటే ప్రాణాలు ముఖ్యం: కేటీఆర్‌

20 Oct, 2020 03:13 IST|Sakshi
సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు

మరో మూడు రోజులు అప్రమత్తం

పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడీ

80 మంది స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం

రంగంలోకి ఆర్మీ,హెలికాప్టర్లు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్‌ చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు అని, ఈ పరిస్థి తుల్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు న్నాయనే వాతా వరణశాఖ హెచ్చరి కలతో ఆస్తినష్టం జరిగినా సమకూర్చు కోవచ్చు కానీ.. ప్రాణనష్టం జరగ రాదన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైదరాబాద్, పరిసర మున్సిపాలిటీ ల్లోని ప్రజలను కాపాడేందుకు, సహాయ, పునరావాసం వంటి కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు 80 మంది స్పెషలాఫీసర్లను నియమించామని వెల్లడించారు. 15 రోజుల పాటు వీరి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రజలు కూడా వర్షం వెలిసేంత వరకు లోతట్టు ముంపు ప్రాం తాల్లో ఉండరాదని, పునరావాస కేంద్రాల్లో ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లోని, శిథిలావస్థలోని భవనాల్లోని వారిని గుర్తించి సహాయ కేంద్రాలకు తరలిస్తు న్నామన్నారు.

సోమవారం జీహెచ్‌ ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఎస్‌ తదితర ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో చిక్కుకున్న వారి సహాయ కార్య క్రమాల కోసం ఇప్పటికే రూ.60 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.670 కోట్లు ఖర్చుచేయనున్నా మని తెలిపారు. ముంపు ప్రాంతాల్లోని వారిని తరలించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న బోట్లు కాక ఏపీ నుంచి 15, కర్ణాటక నుంచి 15 రానున్నాయని, వీటితో కలిసి మొత్తం 50 అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఆర్మీని అప్రమత్తం చేశామని, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచా ల్సిందిగా ఎన్డీఆర్‌ఎఫ్‌ను కూడా కోరామని వివరించారు. నగరంలో 80 కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయన్నారు. మరో మూడు రోజుల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్‌గా ఉందని చెప్పా రు. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక అంచనా మేరకు రూ.1,350 కోట్ల సహాయం అందజేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామని, ఇందులో జీహెచ్‌ఎంసీలో రూ.670 కోట్ల నష్టం జరిగిందని కేటీఆర్‌ తెలిపారు. బ్లాంకెట్లతోపాటు రూ.10 కోట్ల సహాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈసారి అధిక వర్షపాతం..
‘హైదరాబాద్‌లో 1908, సెప్టెంబర్‌ 28న ఒకే రోజు 43 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏడాదిలో అత్యంత అధిక వార్షిక వర్షపాతం 1916లో 142 సెం.మీ.లు రికార్డయింది. నగరంలో ఏడాదికి సగటు వర్షపాతం 77.9 సెం.మీ.లు కాగా ఈసారి ఇప్పటికే 120 సెం.మీ.లు పడింది. మరో రెండున్నర నెలల సమయం ఉన్నందున అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. 2004లో ఒకేరోజు బేగంపేటలో 24 సెం.మీ. నమోదైంది. ఈ సీజన్‌లో ఘట్‌కేసర్‌లో 32 సెం.మీ.లు పడింది’ అని కేటీఆర్‌ తెలిపారు.

11 రకాల రేషన్‌ సరుకులు..
‘జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిరంతరం శ్రమిస్తూ వేలమందిని కాపాడారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన మందులు, ఆహారంతో పాటు ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం, మాస్కులు కూడా ఇస్తుంది. కట్టుబట్టలతో వచ్చినా అన్ని సదుపాయాలు ఉంటాయి. వరద బాధితులకు నెలకు సరిపడా 11 రకాల రేషన్‌ సరుకులతో కూడిన కిట్లు, బ్లాంకెట్లు అందజేస్తున్నాం. పారిశుధ్యం, క్రిమిసంహారక, నిర్మా ణ వ్యర్థాల తొలగింపు కార్యక్రమాలు కొనసాగు తున్నాయి. జీహెచ్‌ఎంసీ, పరిసరాల్లోని శివార్లలో 33 మంది మరణించారు. వారిలో 29 కుటుంబాలకు రూ.5 లక్షల వంతున నష్టపరిహారం అందజేశాం. మిగతా నాలుగు కుటుంబాలకు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గల్లంతైన మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 37 మంది మరణించారు. ప్రభుత్వం వద్ద మృతుల వివరాలు, తదితర డేటాలేదని ప్రతిపక్షాలు సిల్లీ మాటలు మాట్లాడొద్దు. సోషల్‌ మీడియాలో వచ్చే విషప్రచారాలు నమ్మొద్దు. ప్రభుత్వ సమాచారాన్నే నమ్మండి’అని మంత్రి స్పష్టంచేశారు. 

చకచకా పనులు..
‘ప్రాణనష్టం జరగకుండా శిథిల భవనాల్లోని వారిని పునరావాస, సహాయ కేంద్రాలకు తరలిస్తున్నాం. 54 అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. 37వేల రేషన్‌ కిట్స్‌లో ఇప్పటికే 18,700 కిట్ల పంపిణీ చేశాం. 920 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు జరిగాయి. ఇంకా 164 ట్రాన్స్‌ఫార్మర్మకు చేయాల్సి ఉంది. 37వేల కుటుంబాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇంకా రెండువేల మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారు. 545 శిథిల భవనాలు గుర్తించి వాటిల్లో 187 భవనాలు కూల్చడం జరిగింది. ఒక్క వారంలోనే 59 భవనాలు కూల్చారు. గుర్రం చెరువు, అప్పా చెరువు, పల్లెచెరువు తెగడం వల్ల భారీ నష్టం జరిగింది’అని కేటీఆర్‌ వివరించారు.

శాశ్వత పరిష్కారం..
‘నగరంలో వరదలకు ఏళ్ల తరబడి పలు కారణాలు న్నాయి. పరిస్థితి చక్కబడ్డాక శాశ్వత పరిష్కార చర్య లు ఆలోచిస్తాం. నాలాలు, చెరువుల కబ్జాలతోపాటు వాటిల్లో ఇష్టానుసారం వేస్తున్న ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలు తదితరమైనవెన్నో ముంపునకు కారణాలు. ఇవన్నీ ఒక్కరోజులో జరిగింది కాదు. నగరంలో 104ఏళ్ల తర్వాత వచ్చిన విపత్తు ఇది. నేను వెళ్లిన దాదాపు 40 కాలనీల్లోని ప్రజలు కూడా శాశ్వత పరిష్కారం కోరారు. నష్టపరిహారంపై సీఎం తగిన నిర్ణయం తీసుకుంటారు. చెరువుల్లో కాలనీలు వచ్చా యని, ప్రభుత్వమే అనుమతులిచ్చిందని, ఎల్‌ఆర్‌ ఎస్, బీఆర్‌ఎస్‌ చేస్తుందని కొందరు చెబుతున్నారు. వాటి గురించి మరోసారి చర్చించవచ్చు’అని ప్రతిపక్షాలకు కేటీఆర్‌ సూచించారు.

విశ్వనగరాల్లోనూ వరదలు..
‘ఇదేనా డల్లాస్, న్యూయార్క్‌ అని కొందరు వ్యాఖ్యా నిస్తున్నారు. వర్షం పడితే విశ్వనగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇష్టానుసారం మాటలొద్దు. ఈ సమస్యకు పరిష్కారాలను వెతికి పట్టుకోవా ల్సిందే. ముంబై, చెన్నై, బెంగళూర్‌ వంటి నగరా ల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. టోక్యోలో నీటిని పీల్చే గుణం కలిగిన భూగర్భ ఏర్పాట్లున్న ప్పటికీ, మన నగరానికి ప్రాక్టికల్‌గా అలాంటివి వీలుకాదు. నగరంలో ముంపునకు కారణాలపై కిర్లోస్కర్, వాయెంట్స్, ఐఐఐటీ, జేఎన్‌ టీయూ నివేదికలు, శాటిలైట్‌ చిత్రాలు ఉన్నాయి. శిథిల భవనాలను గుర్తించేందుకు ఆస్కి సహకారం కూడా తీసుకుంటున్నాం’అని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు