మంత్రి కేటీఆర్‌ ఔదార్యం.. గాయపడిన మహిళను..

2 Nov, 2022 10:29 IST|Sakshi
గాయపడ్డ మహిళను పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్‌  

కాన్వాయ్‌ ఆపి రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలింపు 

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌: మంత్రి కేటీఆర్‌ మానవ­త్వాన్ని చాటుకున్నారు. నాగర్‌­కర్నూల్‌ జిల్లా ఉర్కొండ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జమ్ముల నర్మద, రమేశ్‌ దంపతులు వారి కుమారుడిని ద్విచక్ర­వాహనంపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో దింపి మంగళవారం సాయంత్రం తిరుగుపయనమయ్యారు.

పెద్ద అంబర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులోని వ్యక్తులు అకస్మాత్తుగా డోర్‌ తెరవడంతో దంపతులు కిందపడి గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ జాతీయ రహదారిపై మునుగోడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ తన కారును ఆపి ప్రమాదానికి గురైన దంపతులను పరామర్శించారు. వెంటనే వారిని తన కాన్వాయ్‌లోని ఓ కారులో హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఔదార్యంపై స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు