ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం ప్రకటించండి 

1 Mar, 2021 03:29 IST|Sakshi

ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటును మించి అభివృద్ధి 

హైదరాబాద్‌ లాంటి నగరాలు దేశానికి ఆర్థిక ఇంజిన్లు

కేంద్ర ఐటీ మంత్రికి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఆరేళ్లుగా అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్‌ నగరానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) లేదా దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలోనూ తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. జాతీయ సగటు 1.9 శాతంతో పోలిస్తే.. తెలం గాణ 7 శాతం వృద్ధి రేటుతో ఎగుమతులు రూ.1.4 లక్షల కోట్లకు చేరాయన్నారు. అ లాగే ఆఫీస్‌ స్పేస్‌ 8.7 మిలియన్‌ చదరపు అడుగులు పెరిగిందని, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, గోల్డ్‌మాన్‌ సాక్స్, ఫియట్‌ క్రిస్లార్‌ ఆటోమొబైల్స్‌ వంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులతో వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కోసం అనేక పాలసీలు రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఐటీ రంగం వృద్ధికి అనువైన వాతావరణం ఉందని లేఖలో పేర్కొన్నారు. 

ఐటీలో హైదరాబాద్‌ను ప్రోత్సహించండి 
హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు సం బంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేం ద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కలిశారని, తాను కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నా రు. ఐటీఐఆర్‌పై కేంద్రం చేస్తున్న తాత్సారంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. దేశానికి ఆర్థిక ఇంజన్లుగా పనిచేస్తున్న హైదరాబాద్‌ లాంటి నగరాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీఐఆర్‌పై యువత ఆశలను అడియాశలు చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు